ఆదివాసీలపై దాడులు దుర్మార్గం: విజయశాంతి
ABN , First Publish Date - 2022-06-11T04:44:49+05:30 IST
తెలంగాణలో నిరంకుశ ప్రభుత్వం రాజ్యమేలుతోందని... కేసీఆర్ పాలనలో ఎక్కడ చూసినా పేదోళ్లకు ఆన్యాయమేనని బీజేపీ సీనియర్ నేత విజయశాంతి టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్: తెలంగాణలో నిరంకుశ ప్రభుత్వం రాజ్యమేలుతోందని...కేసీఆర్ పాలనలో ఎక్కడ చూసినా పేదోళ్లకు అన్యాయమేనని బీజేపీ సీనియర్ నేత విజయశాంతి టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం సోషల్ మీడియాలో రాములమ్మ ఓ పోస్ట్ చేశారు. దానిని అలానే ఇస్తున్నాం. ‘‘తాజాగా... ఈ సర్కార్ అమాయకులైన ఆదివాసీలపైన పడింది. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం పేదలకు భూములిస్తే... కేసీఆర్ ప్రభుత్వం వాటిని లాక్కుంటోంది. పేదల భూములను లాక్కోవాలనుకోవడం పరమ దారుణం. కేసీఆర్ ప్రభుత్వంలో సామాన్యులకు న్యాయం జరగడంలేదు.పోడు భూములకు శాశ్వత పరిష్కారం కల్పిస్తామని చెప్పి... దరఖాస్తులు తీసుకొని నెలలు గడుస్తున్నా.. ఇప్పటికీ సర్కార్ నుంచి ఎలాంటి ఉలుకుపలుకు లేదు. అడవులను రక్షిస్తున్న ఆదివాసీలపై ఫారెస్ట్ అధికారులు దాడులకు పాల్పడటం దుర్మార్గం. పుల్లలేరుకోడానికి వెళ్లిన ఆదివాసీ మహిళలను... పసిపిల్లలున్నారనే కనికరం కూడా లేకుండా జైల్లో పెట్టారు. ఏం కేసీఆర్.... తెలంగాణ ఏమైనా నీ జాగీరు అనుకుంటున్నవా? ఆదివాసీలపై దాడులను ఆపకపోతే ప్రజలే తిరగబడతరు. వారే నీకు తగిన బుద్ధి చెప్తారు. ఎకరం పోడు భూమిని కూడా పోనియ్యబోమని ఆదివాసీ బిడ్డలకు బీజేపీ పార్టీ తరుపున భరోసా ఇస్తున్నాము. బీజేపీ అధికారంలోకి వచ్చాక పోడు భూములకు పట్టాలు ఇస్తాం. ఈ దగాకోరు సర్కార్కు రోజులు దగ్గర పడ్డాయి. కేసీఆర్ సారును త్వరలోనే తెలంగాణ ప్రజలు పర్మినెంట్గా ఫామ్ హౌస్కి పంపించడం ఖాయం’’ అని విజయశాంతి టీఆర్ఎస్ సర్కారుపై ధ్వజమెత్తారు.