సకాలంలో జీతాలివ్వక ప్రభుత్వం ఉద్యోగులతో కన్నీళ్లు పెట్టిస్తోంది : రాములమ్మ

ABN , First Publish Date - 2021-10-08T15:15:59+05:30 IST

ధనిక రాష్ట్రమని గొప్పలు చెప్పుకోవడం తప్ప రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతమివ్వడం లేదంటూ బీజేపీ నాయకురాలు విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు.

సకాలంలో జీతాలివ్వక ప్రభుత్వం ఉద్యోగులతో కన్నీళ్లు పెట్టిస్తోంది : రాములమ్మ

హైదరాబాద్: ధనిక రాష్ట్రమని గొప్పలు చెప్పుకోవడం తప్ప రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతమివ్వడం లేదంటూ బీజేపీ నాయకురాలు విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. 5వ తేదీలోగా జీతమందితే గానీ జీవనం గడవని దుస్థితి ఉద్యోగులదన్నారు. అలాంటి ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా ప్రభుత్వం కన్నీళ్లు పెట్టిస్తోందని రాములమ్మ తెలిపారు. ఉద్యోగుల జీతభత్యాలపై ఏ చీకు చింతా లేని రాచరిక దుర్మార్గపు పాలనకు.. యావత్ తెలంగాణ ప్రభుత్వ, కాంట్రక్టు,ఇతర ఉద్యోగులు రానున్న ఎన్నికల్లో తగిన బుద్ది చెబుతారని  పేర్కొన్నారు.




‘‘దేశంలోనే తెలంగాణ ధనిక రాష్ట్రమని గొప్పలు చెప్పే రాష్ట్ర సర్కార్.... రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎందుకని సకాలంలో జీతాలు అందించడం లేదో తెలపాలి. నెలంతా కష్టపడి ప్రతి నెల 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకైనా జీతాలు అందితే గాని కుటుంబాలు జీవనం సాగని దుస్థితి వారిది. పథకాల అమలుకు, ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహణ చేసే ప్రభుత్వ ఉద్యోగులతో పాటు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, సెర్చ్ ఉద్యోగులపై టీఆర్ఎస్ సర్కార్ చిన్న చూపు చూస్తూ సకాలానికి జీతాలు ఇవ్వకుండా కన్నీళ్లు పెట్టిస్తోంది. రాష్ట్రంలో అతిపెద్ద పండుగగా భావించే బతుకమ్మ సంబురం మొదలుకావడంతో ఉద్యోగుల కుటుంబాల్లో సంతోషం లేకుండా చేస్తుంది. పండగ పూట చేతిలో డబ్బు లేక ఆందోళన పడాల్సిన దుస్థితి దాపురించింది. 


మరోవైపు నాలుగో తరగతి ఉద్యోగులకు ప్రతి నెల 14నుంచి 20 వరకు వేతనాలు జమకాని పరిస్థితులు ఏర్పడ్డాయంటే రాష్ట్ర సర్కార్ ఉద్యోగులపై ఎంత చిత్త శుద్ధి కనబరుస్తుందో అర్ధమవుతోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగైందంటూనే జీతాలను ఆలస్యం చేస్తూ దాదాపు ఆరునెలల నుంచి వేతనాలను జిల్లాల వారీగా ఇస్తోంది. ఇప్పుడు పండుగల సమయంలో కూడా పాత పద్ధతినే అమలు చేస్తామని ఉన్నతాధికారుల ద్వారా వెల్లడించడం సిగ్గుచేటు. ఒడ్డు దాటేదాకా ఓడ మల్లన్న.. ఒడ్డు దాటాక బోడ మల్లన్న అన్నట్టు ఉంది రాష్ట్ర సర్కార్ తీరు. పట్టభద్రుల ఎన్నికలప్పుడు పీఆర్సీ పెంచుతాం, జీతాలు పెచుతాం అని ఓట్లు పొందడమే కానీ ఇప్పటి వరకూ పెంచిన జీతాలు ఇవ్వకుండా ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగులకు మినహా, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్‌తో  పాటు హోంగార్డులు, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీలకు పెరిగిన వేతనాలు అందించకుండా పాత వేతనాలనే విడుదల చేస్తోంది రాష్ట్ర సర్కార్. ఆర్థిక శాఖ నుంచి అనుమతి ఇవ్వకుండా వేతనాల పెంపుపై జీవోలు జారీ చేయకుండా ఉద్యోగులను అన్యాయం చేస్తుంది. కేవలం హుజురాబాద్ ఉప ఎన్నికపై ఓటమి భయంతో ఉన్న రాష్ట్ర సర్కార్. అక్కడి ఓటర్లకు గాలం వేయడానికి డబ్బును, మద్యాన్ని, దావత్‌లను ఇస్తూ డబ్బు ఖర్చు చేస్తుందే కానీ ఉద్యోగుల జీతభత్యాలపై ఏ చీకు చింతా లేని రాచరిక దుర్మార్గపు పాలనపై.. యావత్ తెలంగాణ ప్రభుత్వ, కాంట్రక్టు,ఇతర ఉద్యోగులు రానున్న ఎన్నికల్లో తగిన బుద్ది చెబుతారు’’ అని విజయశాంతి పేర్కొన్నారు.




Updated Date - 2021-10-08T15:15:59+05:30 IST