ఆ జీవితాలు త్వరగా గాడిన పడాలి: విజయశాంతి

ABN , First Publish Date - 2021-11-23T01:32:04+05:30 IST

వాయుగుండం ప్రభావంతో కురిసిన భారీవర్షాలకు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలు అతలాకుతలమయ్యాయి.

ఆ జీవితాలు త్వరగా గాడిన పడాలి: విజయశాంతి

హైదరాబాద్: వాయుగుండం ప్రభావంతో కురిసిన భారీవర్షాలకు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలు అతలాకుతలమయ్యాయి. లక్షలాది ఎకరాలు ముంపు బారిన పడటంతో చేతికందిన పంట ఏటి పాలైంది. వరద సృష్టించిన విలయం నుంచి బాధితులు ఇంకా కోలుకోలేకపోతున్నారు. కడప జిల్లాలో చెయ్యేరు వరద విధ్వంసానికి 24 గ్రామాల ప్రజలు సర్వం కోల్పోయి నిరాశ్రయులయ్యారు. ప్రతి పల్లెలో 1000కి పైగా మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. పదుల సంఖ్యలో మృత్యువాత పడ్డారు. 


ఏపీలో వరదలు మిగిల్చిన విషాదంపై బీజేపీ నేత విజయశాంతి స్పందించారు. ‘‘ఎడతెగని వర్షాలతో కన్నీటి కడలిలా మారిన ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ, నెల్లూరు జిల్లాల ప్రజల అగచాట్లు చూస్తుంటే గుండె బరువెక్కుతోంది. వాగులు, వంకలు పొంగి పొర్లుతూ ఊళ్ళను ముంచెత్తాయి. ఉధృతంగా ప్రవహిస్తున్న వరదనీటిలో అయినవారు కళ్ళముందే కొట్టుకుపోయారు. ఇన్నాళ్ళూ తోడుగా ఉండి.... మన ఇంటి మనుషుల్లా... ప్రాణానికి ప్రాణంగా పెంచి పోషించుకున్న పశుసంపద మౌనంగా రోదిస్తూ జలప్రవాహంలో కలిసిపోయింది. పిల్లాపాపల బేల చూపుల మధ్య... ఏం చెయ్యాలో దిక్కుతోచక స్తంభించిపోయిన ఆ జీవితాలు ఎప్పటికి తేరుకుంటాయో అర్థంకాని పరిస్థితి నెలకొంది’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

‘‘ఒకవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగాలు తమ శాయశక్తులా ప్రజలను ఆదుకునేందుకు ముందుకు వస్తున్నప్పటికీ... ఈ విపత్కర సమయంలో సహాయక చర్యలు మరింత వేగవంతం కావాలంటే ఆ సిబ్బందికి తోడుగా మరికాస్త మానవవనరుల సహాయం అవసరమనిపిస్తోంది. అందుకే రెవెన్యూ, మున్సిపల్ సిబ్బందికి తోడుగా అవసరమైన చోట్ల ఎన్‌సీసీ విద్యార్థుల సహకారాన్ని కూడా తీసుకుంటే వీలైనంత త్వరగా పరిస్థితులు చక్కబడవచ్చు. చెల్లాచెదురైన జీవితాలు త్వరితగతిన గాడిన పడాలని ఆ పరమాత్మను వేడుకుంటున్నాను’’ అని విజయశాంతి పేర్కొన్నారు.

Updated Date - 2021-11-23T01:32:04+05:30 IST