బంగారు తెలంగాణలో ప్రైవేట్ ఆస్పత్రులే దిక్కా?: విజయశాంతి
ABN , First Publish Date - 2022-07-28T00:58:36+05:30 IST
హైదరాబాద్: కేసీఆర్ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ నాయకురాలు విజయశాంతి ఆరోపించారు.
హైదరాబాద్: కేసీఆర్ (KCR) పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ నాయకురాలు విజయశాంతి (VIJAYASHANTHI) ఆరోపించారు. భారీ వర్షాలు, వరదల కారణంగా డెంగీ, మలేరియా, టైఫాయిడ్ లాంటి జ్వరాలు ప్రబలుతున్నా ప్రభుత్వం చోద్యం చూస్తోందని ఆమె విమర్శించారు. ఇండ్ల చుట్టూ నీళ్లు నిలిచిపోవడం, డ్రైనేజీలు నిండిపోవడం, ఓపెన్ ప్లాట్లన్నీ మురికి కుంటల్లా మారడంతో దోమలు వృద్ధి చెంది డెంగీ విజృంభిస్తోందన్నారు. వర్షాకాలం ప్రారంభంలోనే పారిశుద్ధ్య చర్యలు చేపట్టాల్సిన సర్కారు ఆ దిశగా ప్రయత్నాలు చెయ్యడంలేదని చెప్పారు.
గ్రామాల్లో జ్వరాల ప్రభావం ఎక్కువగా ఉండడంతో రోగులు పీహెచ్సీలకు క్యూ కడుతున్నారని, అయినా వైద్యం సరిగా అందట్లేదని విజయశాంతి ఆరోపించారు. మరో దిక్కులేక ప్రజలు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారని ఆమె చెప్పారు. ఇదే అదనుగా ప్రైవేట్ ఆస్పత్రులు అందినకాడికి దండుకుంటున్నాయన్నారు. ఇంత జరుగుతున్నా కేసీఆర్ సర్కార్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని రాములమ్మ మండిపడ్డారు.