Vijayashanti: అధికారపార్టీకి బీజేపీని చూస్తే వణికిపోయే పరిస్థితి..

ABN , First Publish Date - 2022-08-23T21:22:02+05:30 IST

తెలంగాణ పాలక పార్టీలో బీజేపీని చూస్తే వణికిపోయే పరిస్థితి నెలకొందని విజయశాంతి అన్నారు.

Vijayashanti: అధికారపార్టీకి బీజేపీని చూస్తే వణికిపోయే పరిస్థితి..

హైదరాబాద్ (Hyderabad): తెలంగాణ పాలక పార్టీ (TRS)లో బీజేపీ (BJP)ని చూస్తే వణికిపోయే పరిస్థితి నెలకొందని విజయశాంతి (Vijayashanti) అన్నారు. సోషల్ మీడియా పోస్టు ద్వారా స్పందిస్తూ ఆమె ఈ వాఖ్యాలు చేశారు. ప్రశ్నిస్తున్న కాషాయదళం ఉనికిని తట్టుకోలేక రెండు రోజులుగా బీజేపీ కార్యకర్తలు, నాయకులను అరెస్ట్ చేయించడమే ఈ ప్రభుత్వం పనిగా పెట్టుకుందని విమర్శించారు. తప్పు చేసినవారు ఎంతటి వారైనా చర్యలు తప్పవని పదే పదే చెప్పుకునే సీఎం కేసీఆర్ (CM KCR) తన బిడ్డ విషయంలో మౌనం వహించడాన్ని.. బీజేపీ ప్రశ్నించడం ఆయనకు మింగుడు పడడంలేదన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన చేస్తున్న బీజేపీ కార్యకర్తల్ని అరెస్ట్ చేసి కేసులు పెట్టడమే గాకుండా.... ఆ విషయమై నిలదీసినందుకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ (Bandi Sanjay)ని అరెస్ట్ చేయించారని మండిపడ్డారు. రాష్ట్రంలో నిరసన అంటే చాలు ఉక్కుపాదం మోపి అణిచేందుకు కేసీఆర్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. బీజేపీ అంటే టీఆర్ఎస్‌కు ఎందుకంత భయం పట్టుకుందో ఈ పరిణామాలు చూస్తే చాలు అర్థమవుతోందన్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ప్రజాసమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చే వేదిక ధర్నా చౌక్‌నే మూయించిన ఈ సర్కారు నుంచి ఇంతకంటే ఆశించడానికేముందని విజయశాంతి వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-08-23T21:22:02+05:30 IST