కుల వృత్తుల పేరిట కుట్ర: విజయశాంతి

ABN , First Publish Date - 2021-10-13T00:38:01+05:30 IST

రాష్ట్రంలో అత్యధిక జనాభాగా ఉన్న బీసీలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తామని..

కుల వృత్తుల పేరిట కుట్ర: విజయశాంతి

హైదరాబాద్: రాష్ట్రంలో అత్యధిక జనాభాగా ఉన్న బీసీలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తామని చెప్పిన బీసీ పాలసీ ఇప్పుడు పత్తా లేకుండా పోయిందని బీజేపీ నాయకురాలు విజయశాంతి అన్నారు. సీఎం అధ్యక్షతన అసెంబ్లీలో బీసీ ప్రజాప్రతినిధులతో మూడు రోజులపాటు ఆడంబరంగా నిర్వహించిన సమావేశాలు ఉత్త ముచ్చట్లే అయ్యాయని ఆమె ఎద్దేవా చేశారు. ‘‘బీసీ పాలసీ కోసం 2017 డిసెంబర్‌లో బీసీ సంఘాలతో పాటు బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో సీఎం కేసీఆర్​అసెంబ్లీలో భేటీ అయ్యారు. మూడు రోజులపాటు సమావేశాలు నిర్వహించారు. బీసీల సమస్యల పరిష్కారానికి సలహాలు, సూచనలు తీసుకున్నారు. 210 తీర్మానాలు చేసి ఆమోదించారు. ఎడ్యుకేషన్, హెల్త్, రిజర్వేషన్లు, ఉపాధి తదితర రంగాలపై కీలక నిర్ణయాలు తీసుకుని తీర్మానాలన్నీ అమలు చేస్తామని అప్పట్లో సీఎం కేసీఆర్​ హామీ ఇచ్చారు.  ఇదే అంశంపై అసెంబ్లీలో ప్రకటన చేసి కౌన్సిల్‌లో తీర్మానం చేశారు. మొత్తం 210 తీర్మానాలు ఇప్పుడు అటకెక్కాయి. మాట ఇచ్చి నాలుగేళ్లు అవుతున్నా అతీగతీ లేకుండా పోయింది. పాలసీ వస్తే అన్ని రంగాల్లో ముందుకు వెళ్లవచ్చని భావించిన బీసీలకు నిరాశే ఎదురైంది. ఏదో చేయబోతున్నట్లు అప్పట్లో హైప్​ క్రియేట్​చేసి 2018 ఎన్నికల్లో గెలిచాక ఆ తీర్మానాలను మూలకు పడేసిన రాష్ట్ర సర్కార్... బీసీలను పట్టించుకోవడం పక్కన పెడితే... ఇచ్చిన హామీలను కూడా అమలు చేయడం లేదు.’’ అని అన్నారు.  రాష్ట్రంలో కుల వృత్తుల పేరిట ప్రజలను మళ్ళీ పాతాళానికి నెట్టివేయడానికి టీఆర్ఎస్ సర్కార్ కుట్ర పన్నుతోందని విజయశాంతి పేర్కొన్నారు. 


కేవలం ఓట్ల కోసం కొన్ని వర్గాల ప్రజలను మభ్య పెడుతూ నోట్లతో ఓట్లు, సీట్లు అంటూ టీఆర్ఎస్ ప్రభుత్వం పాకులాడుతోందని విజయశాంతి విమర్శించారు. ఇప్పుడు జరిగే హుజురాబాద్ ఉపఎన్నికలో కూడా ఎక్కువగా దళిత ఓటర్లను ప్రభావితం చేయడానికి దళితుల అభ్యున్నతికి తాను కృషి చేస్తున్నట్లు కేసీఆర్ చెబుతున్నారు. గతంలో దళితులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి. దళితులకు మూడెకరాల భూ పంపిణీ చేయకుండా, రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేద్కర్ 125 జయంతి సందర్బంగా 125 అడుగుల విగ్రహం ఏర్పాటు చేస్తానని చెప్పి చేయకుండా ఇప్పుడు దళిత సాధికారత అంటూ దళితబంధు అనే పథకం పెట్టి దళితులను మోసం చేయాలని చూస్తున్నారు. ఇలా రాష్ట్రంలో ఉన్న ఎస్సీలను, బీసీలను రాష్ట్ర సర్కార్ మోసం చేస్తున్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ని గెలిపించి టీఆర్ఎస్ పార్టీకి చరమగీతం పాడుతారు.’’ అని విజయశాంతి వ్యాఖ్యానించారు. 



Updated Date - 2021-10-13T00:38:01+05:30 IST