Vijayashanti Questioned Kcr: ఆ హామీలు నీటి మీద రాతలేనా?

ABN , First Publish Date - 2022-09-02T03:12:43+05:30 IST

తెలంగాణలో నిరుద్యోగ సమస్య తీవ్రం అవుతున్నప్పటికీ ప్రత్యామ్నాయంపై ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి పెట్టడం లేదని బీజేపీ నాయకురాలు విజయశాంతి ప్రశ్నించారు. నిరుద్యోగ భృతితో ...

Vijayashanti Questioned Kcr: ఆ హామీలు నీటి మీద రాతలేనా?

హైదరాబాద్: తెలంగాణ (Telangana)లో నిరుద్యోగ సమస్య తీవ్రం అవుతున్నప్పటికీ ప్రత్యామ్నాయంపై ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి పెట్టడం లేదని బీజేపీ నాయకురాలు విజయశాంతి (Vijayashanti) ప్రశ్నించారు. నిరుద్యోగ భృతితో పాటు వివిధ కార్పొరేషన్ల కింద లోన్స్ ఇస్తామని చెప్పి ఏళ్ళు గడుస్తున్నా హామీలు మాత్రం నెరవేరలేదని ఆమె మండిపడ్డారు. సబ్సిడీలోన్ల కోసం కార్పొరేషన్లలో అప్లికేషన్స్ పెట్టిన లక్షలాది మంది కాళ్లరిగేలా తిరుగుతున్నారని.. దళితబంధు ఇస్తున్నట్టు ప్రభుత్వం చెబుతున్నా ఎస్సీల్లో ఒక్క శాతం మందికి కూడా ఆ పథకం అమలయ్యే పరిస్థితి లేదని విజయశాంతి వ్యాఖ్యానించారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడగా ప్రభుత్వం వాటిని పక్కన పెట్టింద‌నే విమర్శలు వెల్లువెత్తుతున్నాయన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటికీ రెండుసార్లు అధికారంలోకి వచ్చినా నిరుద్యోగ సమస్యపై సీరియస్‌గా దృష్టి పెట్టడం లేదని చెప్పారు. టీఎస్పీఎస్సీ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 20 లక్షల మందికి పైగా నిరుద్యోగులు ఉన్నారని... అయితే ఈ సంఖ్య  అంతకంటే ఎక్కువే ఉన్నట్టు దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్‌కు రోజూ వచ్చేవారిని చూస్తే అర్థమవుతుందన్నారు. ప్రభుత్వ కొలువులు ఇవ్వలేకపోయినా... ఉపాధి అవకాశాలు కల్పించి నిరుద్యోగ సమస్య తీరుస్తామనీ... ఎవరి కాళ్ల మీద వాళ్ళు నిలబడేలా చూస్తామని నేతలు చెప్పే మాటలు నీటి మీద రాతలే అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. 


‘‘గత ప్రభుత్వాల కాలంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన యువతకు ఆయా కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీతో రుణాలిచ్చారు. కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై 8 ఏళ్లయినా ఇంత వరకూ ఎవరికీ రుణాలు రాక పోగా, ఎస్సీలకు 3 ఎకరాల భూమి కూడా అటకెక్కింది. ఈ మధ్య ఆర్భాటంగా ప్రకటించిన దళితులకు 10 లక్షల దళితబంధు కూడా కొంతమందికే ఇవ్వడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఒక్కో నియోజకవర్గంలో 100 మంది ఎస్సీలకే ఇస్తామంటే ఎలా? అని ప్రశ్నిస్తున్నారు. లోన్ కోసం తాము అప్లై చేసుకుని చాలా రోజులు గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకూ ఇవ్వలేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా హామీల మీద హామీలు గుప్పించి... దళితులతో పాటు అన్ని వర్గాల వారిని మోసగిస్తున్న ఈ సర్కారును గద్దె దించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు.’’ అని విజయశాంతి అన్నారు. 



Updated Date - 2022-09-02T03:12:43+05:30 IST