కొణిజర్ల మహిళలపై దుశ్చర్య: విజయశాంతి

ABN , First Publish Date - 2021-08-13T01:32:06+05:30 IST

పోడు భూముల విషయమై ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలానికి చెందిన మహిళలపై రాష్ట్ర పోలీసులు వ్యవహరించిన తీరు బాధాకరమని భారతీయ జనతా పార్టీ నేత విజయశాంతి ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల్ని అకారణంగా జైలుకు పంపించి వారిపై హత్యాయత్నం సెక్షన్లను

కొణిజర్ల మహిళలపై దుశ్చర్య: విజయశాంతి

హైదరాబాద్: పోడు భూముల విషయమై ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలానికి చెందిన మహిళలపై రాష్ట్ర పోలీసులు వ్యవహరించిన తీరు బాధాకరమని భారతీయ జనతా పార్టీ నేత విజయశాంతి ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల్ని అకారణంగా జైలుకు పంపించి వారిపై హత్యాయత్నం సెక్షన్లను మోపారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. జైలులో వారికెదురైన హింసాకాండను వివరిస్తుంటే కడుపు రగిలిపోయిందని విజయశాంతి అన్నారు.


ఈ ఘటనలపై విజయశాంతి తన ఫేస్‌బుక్ అధికారిక ఖాతా ద్వారా స్పందిస్తూ..

‘‘ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో పోడు భూమూల విషయమై వారం కిందట జరిగిన నిరసనల్లో అటవీ సిబ్బందిపై దాడి, హత్యాయత్నానికి పాల్పడ్డారంటూ నెలల వయసు పసిపిల్లల తల్లులతో పాటు మరికొందరు మహిళల్ని అరెస్ట్ చేసి జైలుకు పంపిన దుశ్చర్యను కళ్ళారా చూశాం. ఈ పరిణామాన్ని ప్రజాసంఘాలు, నాయకులు తీవ్రస్థాయిలో విమర్శించడంతో హత్యాయత్నం సెక్షన్లను ఉపసంహరించారు. చివరికి బెయిల్ లభించి కారాగారం నుంచి బయటకొచ్చిన ఆ మహిళలు, జైల్లో వారికెదురైన హింసాకాండను వివరిస్తుంటే కడుపు రగిలిపోయింది. భోజనం బాగా లేదన్నందుకు జైలు సిబ్బంది చెయ్యి చేసుకున్నారని, దుర్భాషలాడుతూ మరుగుదొడ్లు కూడా కడిగించారని, ఒంట్లో బాగోకపోయినా మందులివ్వలేదని జైల్లో ఎదురైన చేదు అనుభవాల్ని చెప్పుకుని రోదించారు. ఈ ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు బాధిస్తోంది. అయితే, జాతీయ బీసీ కమిషన్ ఈ పరిణామాలను సుమోటోగా తీసుకుని విచారణ చేపట్టడం కాస్తలో కాస్త ఊరటనిస్తోంది. తెలంగాణలో మహిళలకు దక్కుతున్న గౌరవానికి ఈ మహిళల దుస్థితి అద్దం పట్టింది’’ అని రాసుకొచ్చారు.



Updated Date - 2021-08-13T01:32:06+05:30 IST