పన్నుల పెంపును వ్యతిరేకిస్తూ సీపీఎం వినూత్న నిరసన
ABN , First Publish Date - 2021-06-21T18:07:34+05:30 IST
ఇంటి పన్ను, చెత్త పన్ను పెంపును వ్యతిరేకిస్తూ సీపీఎం వినూత్న రీతిలో నిరసన చేపట్టింది.
విజయవాడ: ఇంటి పన్ను, చెత్త పన్ను పెంపును వ్యతిరేకిస్తూ సీపీఎం వినూత్న రీతిలో నిరసన చేపట్టింది. రోడ్డు మీద చెత్త పన్ను పెంచవద్దని, ఇంటి పన్ను పెంచవద్దంటూ వ్రాసి, పెయింటింగ్ వేశారు. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాబూరావు మాట్లాడుతూ... కేంద్రం ఆదేశాలతోనే జగన్ ప్రజలపై భారాలు మోపుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వానికి ఇచ్చే అప్పు కోసం పేదలను అప్పుల్లో ముంచుతారా అని ప్రశ్నించారు. ‘‘ఇదేనా జగన్ ప్రజాపాలన అని నువ్వు చెప్పుకునేది’’ అని మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర నాయకులకు చిత్తశుద్ధి ఉంటే.. ముందు మోదీని నిలదీయాలన్నారు. రిజిస్ట్రేషన్, ప్లాన్ లేనివారిపై వంద శాతం పన్ను దుర్మార్గమైన చర్యఅని అన్నారు. విలువ ఆధారంగా ఆస్తి పన్ను పెంపుతో పది రెట్లు భారం పడుతుందని తెలిపారు. పన్నుల పెంపు నిర్ణయం వెనక్కి తీసుకోవాలని బాబూరావు డిమాండ్ చేశారు.