రైల్వేస్టేషన్లో భద్రతా ఏర్పాట్లను పరీశిలించాం: CP Kanthi rana
ABN , First Publish Date - 2022-06-18T17:37:01+05:30 IST
రైల్వేస్టేషన్లలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించామని సీపీ కాంతి రాణా టాటా అన్నారు.
విజయవాడ: రైల్వేస్టేషన్లలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించామని సీపీ కాంతి రాణా టాటా(Kanthi rana tata) అన్నారు. శనివారం ఉదయం రైల్వేస్టేషన్లో బధ్రతా ఏర్పాట్లను పరిశీలించిన సీపీ.. పోలీసులకు తగు సూచనలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఆర్మీ రిక్రూట్మెంట్ ఆందోళనల్లో భాగంగా విజయవాడలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. జీఆర్పీ, ఆర్పీఎఫ్, సివిల్తో పాటు అదనపు బలగాలను మోహరింపజేశామన్నారు. రౌడీషీటర్స్తో పాటు అనుమానితులను ముందస్తు అరెస్ట్లు చేసినట్లు సీపీ చెప్పారు. యువత ఎవరూ హింసకు పాల్పడవద్దన్నారు.
రైల్వే ఆస్తులు ధ్వంసం చేస్తే చట్టాలు కఠినంగా ఉన్నాయని, నాన్ బెయిలబుల్ కేసులతో పాటు ఏడేళ్ల జైలు శిక్ష పడుతుందని తెలిపారు. విధ్వంసాలకు పాల్పడితే భవిష్యత్ పాడవుతుందని చెప్పారు. తల్లిదండ్రులు తమ పిల్లలను నిరసనలు, అల్లర్ల వైపు అడుగులు వేయకుండా చూసుకోవాలని సూచించారు. విజయవాడలో డిఫెన్స్ ఇనిస్టిట్యూషన్స్తో మాట్లాడామని... తగు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. సోషల్ మీడియాపైనా నిఘా పెంచామన్నారు. హింస వైపు ఎవరూ వెళ్లవద్దని అప్పీల్ చేస్తున్నామని సీపీ కాంతి రాణా టాటా అన్నారు.