అసంతృప్తి లేదు
ABN , First Publish Date - 2022-08-16T06:20:46+05:30 IST
అసంతృప్తి లేదు
కొందరి దుష్ప్రచారం వల్లే ఈ పరిస్థితి
స్వాతంత్య్ర వేడుకల్లో ఎంపీ కేశినేని నాని స్పష్టీకరణ
విజయవాడ, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి) : టీడీపీలో తాను అసంతృప్తిగా కొనసాగుతున్నానని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని విజయవాడ ఎంపీ కేశినేని నాని స్పష్టం చేశారు. కేశినేని భవన్లో సోమవారం జరిగిన స్వాతంత్య్ర దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బ్రిటీష్ పాలన కారణంగా వెనుకబాటులో ఉండిపోయిన మన దేశం స్వాతంత్య్రం తర్వాత పుంజుకుని ప్రపంచ దేశాల సరసన సగర్వంగా నిలిచిందని పేర్కొన్నారు. వైద్యరంగంలో భారత్ ఓ మైలురాయిలా మారిందన్నారు. ప్రపంచానికి మొదటగా కొవిడ్ వ్యాక్సిన్ అందించిన దేశం భారత్ అన్నారు.
లక్షల మంది నానీలు పుట్టుకొస్తారు
తనకు టీడీపీపై కానీ, అధినేతపై కానీ ఎలాంటి అసంతృప్తి లేదని నాని స్పష్టం చేశారు. కేవలం కొందరు తమ పబ్బం గడుపుకోవడానికే ఇలాంటి వార్తలను ప్రచారం చేస్తున్నారన్నారు. మీడియా అనవసరంగా తనపై ఫోకస్ చేయొద్దని కోరారు. తాను ఎంపీగా ఉన్నా, లేకున్నా విజయవాడకు నష్టమేమీ లేదని, తనలాంటి నానీలు లక్షలమంది పుట్టుకొస్తారని చెప్పారు. రాజకీయ నాయకులు నిస్వార్థంగా పనిచేయాలన్నారు. అధికార దుర్వినియోగం చేయడం తనకు ఇష్టం లేదన్నారు. తనకు ఉన్న కార్లలో ఒకే ఒక్క కారుపై ఎంపీ స్టిక్కర్ ఉంటుందని, దానిలో తన కూతురిని కూడా తిరగనివ్వనని నాని తెలిపారు.
మాధవ్ది ప్రైవేట్ వ్యవహారం కాదు
ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహారం ప్రైవేట్ వ్యవహారం కాదని, అది కోట్లాది మంది మహిళల ఆత్మగౌరవానికి సంబంధించినదని నాని వ్యాఖ్యానించారు. రాజకీయ నాయకులు చాలా క్లీన్గా ఉండాలని ఆయన హితవు పలికారు.