Vijayawada: వైసీపీ ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తోంది: బుద్దా వెంకన్న
ABN , First Publish Date - 2022-07-17T16:32:26+05:30 IST
వైసీపీ (YCP) ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తోందని టీడీపీ నేత బుద్దా వెంకన్న (Buddha Venkanna) ధ్వజమెత్తారు.
విజయవాడ: వైసీపీ (YCP) ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తోందని టీడీపీ నేత బుద్దా వెంకన్న (Buddha Venkanna) ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తే కేసులు పెట్టిస్తారా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ మద్యం తాగి ప్రజలు చనిపోయారని, బాధితుల పరామర్శకు వెళ్తుంటే అడ్డుకుంటున్నారని అని మండిపడ్డారు. బాధిత కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మద్య నిషేధం అమలు చేయాలని బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు.
బాపట్ల జిల్లా రేపల్లె సమీపంలోని పోటుమెరక గ్రామంలో మద్యం తాగి గరికపాటి నాంచారయ్య (75), రేపల్లె రత్తయ్య (57) మృతి చెందారు. బాధితుల కుటుంబాన్ని పరామర్శించేందుకు టీడీపీ నిజనిర్ధారణ కమిటీ (TDP Fact finding Committee) సభ్యులు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే టీడీపీ కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. నిజనిర్ధారణ కమిటీ సభ్యులను ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు. మాజీమంత్రి నక్కా ఆనంద్బాబు (Nakka Anand Babu), మాజీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, రేపల్లె టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గూడపాటి శ్రీనివాసరావులను హౌస్ అరెస్ట్ చేశారు. రేపల్లెలో నిరసనలు, ర్యాలీలకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. నిరసనలు చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.