Premalatha: పార్టీ విజయంపై దృష్టి సారించండి

ABN , First Publish Date - 2022-08-25T13:57:04+05:30 IST

ప్రజా సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ఏర్పాటైన డీఎండీకే అధికారాన్ని చేపట్టే దిశగా కోట్లాదిమంది కార్యకర్తలు కృషి చేయాలని ఆ పార్టీ కోశాధికారి ప్రే

Premalatha: పార్టీ విజయంపై దృష్టి సారించండి

- కార్యకర్తలకు ప్రేమలత పిలుపు

- ఘనంగా విజయకాంత్‌ జన్మదిన వేడుకలు


చెన్నై, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): ప్రజా సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ఏర్పాటైన డీఎండీకే అధికారాన్ని చేపట్టే దిశగా కోట్లాదిమంది కార్యకర్తలు కృషి చేయాలని ఆ పార్టీ కోశాధికారి ప్రేమలత పిలుపునిచ్చారు. డీఎండీకే వ్యవస్థాపకుడు విజయకాంత్‌(Vijayakanth) 70వ జన్మదిన వేడుకలు ఒకరోజు ముందుగానే బుధవారం ఉదయం కోయంబేడులోని పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఆ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు సహాయాలు పంపిణీ చేశారు. అనంతరం పార్టీ కార్యకర్తలు, ప్రముఖుల కోసం ఉచిత వైద్య శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రేమలత(Premalatha) మాట్లాడుతూ... పార్టీ అధ్యక్షుడు విజయకాంత్‌ కులాసాగా ఉన్నారని, ఆయన ఆరోగ్యపరిస్థితిపై వస్తున్న పుకార్లను పట్టించుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 15న 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని తానే ఎగురవేస్తానని చెప్పడం వల్లే ఆయనను ప్రచార వాహనంలో పార్టీ కార్యాలయానికి తీసుకువచ్చానని, అతికష్టం మీద ఆయన జెండా ఆవిష్కరించారని చెప్పారు. గురువారం ఉదయం తన జన్మదినం సందర్భంగా విజయకాంత్‌ పార్టీ కార్యాలయంలో పార్టీ నేతలు, కార్యకర్తలను స్వయంగా కలుసుకోనున్నారని తెలిపారు. విజయకాంత 70వ జన్మదినవేడుకల సందర్భంగా రాష్ట్ర మంతా జిల్లా నాయకులు నిరుపేదలకు 70 రకాల సహాయాలు పంపిణీ చేస్తున్నారని, పలు చోట్ల సామాజిక సంక్షేమ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారని ఆమె వివరించారు. అంతకు ముందు రామావరంలోని ఎంజీఆర్‌ బధిర పాఠశాల(School) విద్యార్థులకు పార్టీ ప్రముఖులతో కలిసి ఆమె అన్నదానం చేశారు. ఈ వేడుకల్లో డిప్యూటీ కార్యదర్శులు ఎల్కే సుదీష్‌, పార్థసారథి, జిల్లా కార్యదర్శులు న్యాయవాది వీసీ ఆనందన్‌, సెంథిల్‌, కృష్ణమూర్తి, ఆర్‌ఎస్‌ ప్రభాకరన్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-25T13:57:04+05:30 IST