భార్య ఆత్మహత్యాయత్నం...ఆస్పత్రికి తరలించకుండా అడ్డుకున్న భర్త
ABN , First Publish Date - 2022-05-19T18:44:53+05:30 IST
జిల్లాలోని మచిలీపట్నంలో దారుణం జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో పద్మావతి అనే మహిళా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
కృష్ణా: జిల్లాలోని మచిలీపట్నంలో దారుణం జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో పద్మావతి అనే మహిళ ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బాధితురాలిని అంబులెన్స్లో ఆసుపత్రికి తరలిస్తుండగా మద్యం మత్తులో భర్త గంజల శేషగిరిరావు అడ్డగించాడు. భార్యకు చికిత్స చేయించేది లేదంటూ అంబులెన్స్ను అడ్డుకున్నాడు. అంబులెన్స్కు అడ్డుపడిన గంజల శేషగిరిరావును అనూప్ అనే వ్యక్తి మందలించగా...అతడిపై కత్తితో దాడి చేశాడు. శేషగిరిరావు దాడిలో అనూప్ తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమంగా మారడంతో ఉరివేసుకున్న మహిళతో పాటు అనూప్ను అదే అంబులెన్స్లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితులు పద్మావతి, అనుప్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దాడికి కారకుడైన గంజల శేషగిరిరావు పరారీలో ఉన్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.