ఎండుతున్న పల్లె ప్రకృతి వనం
ABN , First Publish Date - 2020-12-04T05:11:37+05:30 IST
ఎండుతున్న పల్లె ప్రకృతి వనం
- మొక్కల ఆలనాపాలన కరువు.. నీళ్లు పోసేవారు లేరు..
- గ్రామానికి దూరంగా ఏర్పాటు.. పశువులకు ఆవాసం
- పట్టించుకోని పంచాయతీ పాలకవర్గం : గ్రామస్థుల విమర్శ
కేశంపేట: పంచాయతీ పాలకవర్గం పట్టించుకోకపోవడంతో ఎకరం విస్తీర్ణంలో గ్రామంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనం ఎండిపోతోంది. తద్వారా గ్రామీణులకు పార్క్ వంటి ప్రదేశంలో ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించాలన్న ప్రభుత్వ సంకల్పం ఫలించడం లేదు. ఎవ్వరూ అటువైపు చూడకపోవడంతో పశువుల కాపరులు పశువులను మేపుతున్నారు. ఇదీ మండలంలోని సంగెం గ్రామంలో పల్లె ప్రకృతివనం దుస్థితి. ప్రభుత్వం గ్రామాలకు కొత్త శోభ తీసుకురావడానికి పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేయాలని పంచాయతీలకు సూచించింది. దీంతో గ్రామ పంచాయతీలు ఎకరం పొలాన్ని సేకరించి లక్షకుపైగా నిధులు కేటాయించి ప్రకృతి వనాలను ఏర్పాటు చేశాయి. అయితే సంగెం పంచాయతీ పాలకవర్గం పల్లె ప్రకృతి వనంపై శ్రద్ధ తీసుకోవడం లేదు.
గ్రామానికి దూరంగా వెంచర్లో ఏర్పాటు ...
గ్రామానికి కిలోమీటర్ దూరంలో ఓ వెంచర్లోని 10శాతం వదిలేసిన పంచాయతీ స్థలంలో పల్లె ప్రకృతివనాన్ని ఏర్పాటు చేశారు. దీని చుట్టూ వ్యవసాయ భూములే ఉండడంతో పశువులు, మేకలు, గొర్లు దానిలో మేపుతున్నారు. నాటిన మొక్కలకు పంచాయతీ పాలకులు నీళ్లు పోయించడం లేదు. ఈ పల్లె ప్రకృతి వనం వెంచర్ యజమానికే ఉపయోగకరంగా ఉంది కానీ.. తమకు ఉపయోగపడే విధంగా లేదని గ్రామస్థులంటున్నారు. గ్రామానికి దగ్గరగా ఉన్న స్థలాలను వదిలేసి వెంచర్లో ప్రకృతి వనాన్ని ఎందుకు ఏర్పాటు చేశారని గ్రామస్థులు అధికారులను ప్రశ్నిస్తున్నారు.