ఇసుక టిప్పర్లను అడ్డగించిన గ్రామస్థులు
ABN , First Publish Date - 2020-08-09T10:31:33+05:30 IST
మండలంలోని అజ్జయ్యదొడ్డి ఇ సుక రీచ్ నుంచి రోజూ వందలాది టిప్పర్లు ఇసుకను తరలిస్తుండటంతో రోడ్లు ఛిద్రమవుతున్నాయని స్థానికులు ..
బ్రహ్మసముద్రం, ఆగస్టు 8: మండలంలోని అజ్జయ్యదొడ్డి ఇ సుక రీచ్ నుంచి రోజూ వందలాది టిప్పర్లు ఇసుకను తరలిస్తుండటంతో రోడ్లు ఛిద్రమవుతున్నాయని స్థానికులు అడ్డుకున్నారు. రోడ్డు ధ్వంసం కావటంతో గ్రామస్థులు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శుక్రవారం గ్రామానికి చెందిన లింగన్న చెట్టుపై నుంచి కింద పడ్డాడు. ఆయనను ఆస్పత్రికి ఆటోలో తరలిస్తుండగా దెబ్బతిన్న రోడ్డుపై ఆటో వెళ్లలేకపోయింది. దీంతో కింద పడ్డ వ్యక్తి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఇచ్చింది. ద్విచక్రవాహనంపై ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. శనివారం ఉదయం గ్రామస్థులంతా కలిసి టిప్పర్ల రాకపోకలను అడ్డుకున్నారు. అధిక లోడ్తో టిప్పర్లు పోవడం ద్వారా రోడ్డు ధ్వంసమై ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని, ఇసుక రీచ్ను వెంటనే రద్దు చేయాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న ఇసుక రీచ్ నిర్వాహకులు గ్రామస్థుల వద్దకు వెళ్లి దెబ్బతిన్న రోడ్డును మరమ్మతులు చేయిస్తామని హామీ ఇచ్చి గుంతలను పూడ్చివేశారు.