సరిహద్దులో అల్లర్లు: బీజేపీ సీఎంల మధ్య మాటల యుద్ధం

ABN , First Publish Date - 2021-07-27T00:51:17+05:30 IST

మరో ట్వీట్‌లో అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వా శర్మ స్పందిస్తూ ‘‘మిజోరాం వైపు నుంచి ప్రజలు ఎందుకు కర్రలు పట్టుకుని హింసకు పాల్పడ్డారో వెంటనే దర్యాప్తు చేయాలని గౌరవనీయ జొరంతాంగను కోరుతున్నాను

సరిహద్దులో అల్లర్లు: బీజేపీ సీఎంల మధ్య మాటల యుద్ధం

గువహాటి: అస్సాం, మిజోరాం సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కేంద్ర మంత్రి అమిత్ షా.. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశమైన రెండు రోజులకే సరిహద్దులో ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం గమనార్హం. ఈ విషయమై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అంతే కాకుండా ఈ విషయంలో కల్పించుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కోరారు. అస్సాంలోని చచ్చార్ జిల్లా, మిజోరాంలోని కొలాసిబ్ జిల్లా సరిహద్దులో ఈ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొంత మంది వ్యక్తులు కర్రలు పట్టుకుని ప్రభుత్వ వాహనాలు సహా ఇతర వాహనాలపై దాడులు చేస్తుండగా, పోలీసులు వారిపై లాఠీ చార్జ్ చేస్తున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాను కుదిపివేస్తున్నాయి.


ఓ వీడియోను షేర్ చేస్తూ ‘‘చచ్చార్ నుంచి మిజోరాం వస్తున్న అమాయక జంటపై కొంతమంది గూండాలు, దొంగలు దాడికి పాల్పడ్డారు. ఈ హింసాత్మక ఘటనలను మీరు ఎలా సమర్థించుకుంటారు?’’ అని మిజోరాం ముఖ్యమంత్రి జొరంతాంగ ట్వీట్ చేశారు. మరో ట్వీట్‌లో ‘‘గౌరవ అమిత్ షాతో సమావేశం జరిగింది. ఆశ్చర్యంగా కొద్ది సమయానికే అస్సాంకు చెందిన రెండు కంపెనీల పోలీసు బెటాలియన్లు మిజోరాంలోని ఆటో రిక్షా స్టాండ్‌లో మిజోరామీయులపై లాఠీ చార్జ్ చేశారు, టియర్ గ్యాస్ వదిలారు. సీఆర్‌పీఎఫ్ జవాన్లు, మిజోరాం పోలీసుల మీద కూడా ఈ దాడి జరిగింది’’ అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్లలో అస్సాం సీఎం, డీజీపీ, పీఎంవో, కేంద్ర హోంశాఖలను ట్యాగ్ చేశారు.


మరో ట్వీట్‌లో అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వా శర్మ స్పందిస్తూ ‘‘మిజోరాం వైపు నుంచి ప్రజలు ఎందుకు కర్రలు పట్టుకుని హింసకు పాల్పడ్డారో వెంటనే దర్యాప్తు చేయాలని గౌరవనీయ జొరంతాంగను కోరుతున్నాను. అలాగే చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని ప్రజలను కోరుతున్నాను. ప్రభుత్వాల మధ్య శాంతి చర్చలతోనే సమస్య పరిష్కారం అవుతుంది’’ అని రాసుకొచ్చారు. మరో ట్వీట్‌లో ‘‘ఇప్పుడే ముఖ్యమంత్రి జొరంతాంగ్‌తో మాట్లాడాను. సరిహద్దు రాష్ట్రాలతో ప్రాంతాలతో అస్సాం శాంతిని కోరుకుంటుంది. అవసరమైతే సమస్యను పరిష్కారానికి ఐజ్వాల్‌ను సందర్శించాల్సిందిగా కోరాను’’ అని రాసుకొచ్చారు. ఈయన కూడా తన ట్వీట్లలో పీఎంవో, కేంద్ర హోంశాఖలను ట్యాగ్ చేశారు.

Updated Date - 2021-07-27T00:51:17+05:30 IST