15 తర్వాత వైరా రిజర్వాయర్‌ నీరు విడుదల?

ABN , First Publish Date - 2022-07-06T05:38:29+05:30 IST

వైరా రిజర్వాయర్‌ కుడి, ఎడమకాల్వలకు ఈనెల మూడోవారంలో నీరు విడుదల చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

15 తర్వాత వైరా రిజర్వాయర్‌ నీరు విడుదల?
కరెంట్‌ మోటార్ల కింద చల్లుకున్న వరి విత్తనాలు

వైరా, జూలై 5: వైరా రిజర్వాయర్‌ కుడి, ఎడమకాల్వలకు ఈనెల మూడోవారంలో నీరు విడుదల చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వానాకాలం సీజన్‌లో వరినార్లు పోసుకోవటానికి, నేరుగా వరి విత్తనాలు వెదజల్లుకునేందుకుగానూ ఈనెల 15వతేదీ తర్వాత ఎప్పుడైనా నీరు విడుదల చేసే అవకాశముంది. గత యాసంగిలో వరిసాగుకు దూరంగా ఉన్న రిజర్వాయర్‌ ఆయకట్టు రైతు లు ఈ వానాకాలం సీజన్‌లో సాగు కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. వర్షాకాలం మొదలై నెలరోజులు దాటినా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవక రైతులు నైరాశ్యంలో ఉన్నారు. అయితే యాసంగిలో వరిసాగుచేయని కారణంగా రిజర్వాయర్‌ నుంచి నీరు విడుదల చేయనందున ప్రస్తుతం నీటిమట్టం 15అడుగులుగా ఉంది. రిజర్వాయర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 18.3అడుగులు. ఇంకా 3.3అడుగుల నీరు వచ్చిచేరితే పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంటుంది. మరో పదిరోజులు వ్యవధి ఉండటంతో ఈలోగా వర్షాలు కురిసి వరదలతో రిజర్వాయర్‌ నిండే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. 

యాసంగి నష్టాన్ని వానాకాలంలో అధిగమించాలని..

ప్రభుత్వ హెచ్చరికలతో యాసంగి వరిసాగు చేయకుండా నష్టపోయిన రైతులు కనీసం వానాకాలం సాగుతోనైనా కొంతమేర పంటలు పండించుకోవచ్చుననే ఉచ్చుకతతో ఎదురుచూస్తునారు. అనధికారికంగా 25వేల ఎకరాలకుపైగా ఆయకట్టు ఉంది. యాసంగిలో కేవలం 1500ఎకరాల్లో మాత్రమే వరిసాగుచేశారు. మిగిలిన భూములన్నీ ఖాళీగానే ఉన్నాయి. ఒక విధంగా యాసంగి క్రాఫ్‌ హాలిడేగా రైతులు భావించారు. జూన్‌లో ఈ పచ్చిరొట్ట విత్తనాలు చల్లుకోవాలని భావించినప్పటికీ ఆశించిన స్థాయిలో వర్షాలులేక కొంతమంది రైతులు కొనుగోలు చేసిన విత్తనాలను ఇళ్లలోనే ఉంచుకున్నారు. 

వరినార్లు కోల్పోయేందుకు కూడా సిద్ధపడుతున్న రైతులు

వైరా రిజర్వాయర్‌ ఆయకట్టులోని రైతాంగం ప్రతి ఏటా జూన్‌ చివరి నుంచి జూలై నెలలో వరినార్లు పోసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. జూలై, ఆగస్టు నెలల్లో వర్షాలు కురవని పక్షంలో నష్టాన్ని భరించేందుకు కూడా ఈ ఆయకట్టు రైతులు కొన్నేళ్ల నుంచి మానసికంగా సిద్ధపడి వరినార్లు పోసుకుంటున్నారు. ఈ ఏడాది కూడా ముందుగానే నార్లు పోసుకొని ఆగస్గు నాటికల్లా నాట్లు వేసుకొనేందుకు రైతులు సిద్ధపడుతున్నారు. అలాగే నేరుగా వరివిత్తనాలు వెదజల్లే రైతులు కూడా ఈనెల చివరి నుంచి సాగులోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. గత ఏడాది జూలై మూడోవారంలో నీటిని విడుదల చేసిన అధికారులు ఈ ఏడాది కూడా అదే మాదిరిగా నీరు విడుదల చేసే అవకాశముందని రైతులు భావిస్తున్నారు.


Updated Date - 2022-07-06T05:38:29+05:30 IST