దివ్యాంగ అభిమానికి జెర్సీ బహుమతిగా ఇచ్చి మనసులు గెలుచుకున్న కోహ్లీ

ABN , First Publish Date - 2022-03-08T22:34:46+05:30 IST

ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడిగా పేరుగాంచిన టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ ఇటీవల తన వందో..

దివ్యాంగ అభిమానికి జెర్సీ బహుమతిగా ఇచ్చి మనసులు గెలుచుకున్న కోహ్లీ

మొహాలీ: ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడిగా పేరుగాంచిన టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ ఇటీవల తన వందో టెస్టు ఆడేసి అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ అరుదైన ఘనతకు గాను మ్యాచ్ రెండో రోజు అతడు మైదానంలోకి దిగుతున్నప్పుడు సహచర ఆటగాళ్ల నుంచి ‘గార్డ్ ఆఫ్ ఆనర్’ లభించింది.


ఈ మ్యాచ్‌కు ప్రేక్షకులను అనుమతించడంతో కోహ్లీకి అభిమానుల మద్దతు పుష్కలంగా లభించింది. అభిమానుల నుంచి లభించిన మద్దతుకు కోహ్లీ కూడా పులకించిపోయాడు. తాజాగా, కోహ్లీ నెటిజన్ల హృదయాలను కూడా గెలుచుకున్నాడు. శ్రీలంకతో జరిగిన తొలి టెస్టు ముగిసిన తర్వాత 33 ఏళ్ల కోహ్లీ.. ధరమ్‌వీర్ పాల్ అనే దివ్యాంగ అభిమానికి జెర్సీ బహుమతిగా అందించాడు. ధరమ్‌వీర్‌ పాల్‌ను అధికారికంగా టీమిండియా 12వ ఆటగాడిగా పరిగణిస్తారు. మొహాలీలో బస్ ఎక్కడానికి ముందు కోహ్లీ తనకు జెర్సీ అందిస్తున్న వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేయడంతో ఇది కాస్తా వైరల్ అయింది. 


కోహ్లీ గత రెండేళ్లలో ఒక్క సెంచరీ కూడా చేయలేదు. చారిత్రక వందో టెస్టులో అయినా కోహ్లీ సెంచరీ చేస్తాడని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. కేవలం 45 పరుగులే చేసి వెనుదిగడంతో అభిమానులు నిరాశ చెందారు. అయితే, ఈ టెస్టులో కోహ్లీ టెస్టు క్రికెట్‌లో 8 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. భారత్-శ్రీలంక మధ్య ఈ నెల 12న బెంగళూరులో డే/నైట్ టెస్టు జరగనుంది. 



Updated Date - 2022-03-08T22:34:46+05:30 IST