కొవిడ్ ఆస్పత్రుల అక్రమాలపై.. విజిలెన్స్!
ABN , First Publish Date - 2021-05-07T05:51:31+05:30 IST
పిడుగురాళ్ళలో నిబంధనలకు విరుద్ధంగా కొవిడ్ వైద్యం చేస్తున్న రెండు ప్రైవేట్ ఆసుపత్రుల లైసెన్స్లు రద్దు చేసినట్లు విజిలెన్స్ ఎస్పీ జాషువా తెలిపారు.
పల్నాడులోని రెండు ఆస్పత్రుల యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు
కఠినంగా వ్యవహరిస్తాం..: విజిలెన్స్ ఎస్పీ జాషువా
గుంటూరు, మే 6 (ఆంధ్రజ్యోతి): పిడుగురాళ్ళలో నిబంధనలకు విరుద్ధంగా కొవిడ్ వైద్యం చేస్తున్న రెండు ప్రైవేట్ ఆసుపత్రుల లైసెన్స్లు రద్దు చేసినట్లు విజిలెన్స్ ఎస్పీ జాషువా తెలిపారు. వీటి నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, వారిని అరెస్టు చేశామన్నారు. గుంటూరు విజిలెన్స్ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. పిడుగురాళ్ళలోని పల్నాడు, అంజిరెడ్డి ఆసుపత్రులపై దాడులు నిర్వహించగా రెమ్సిడివిర్ ఇంజక్షన్ ఒక్కొక్కటి రూ.10 వేలకు అమ్మినట్లు తేలిందన్నారు. పల్నాడు ఆసుపత్రిలో ఓ కొవిడ్ బాధితుడి వద్ద ఆరు రోజులకు రూ.3.15 లక్షలు వసూలు చేశారన్నారు. అంజిరెడ్డి ఆసుపత్రిలో ఓ పేషెంట్ వద్ద నాన్ క్రిటికల్ ట్రీట్మెంట్కు రూ.1.5 లక్షలు వసూలు చేసినట్లు ఫిర్యాదు రావటంతో తనిఖీలు చేయగా ఆరోపణలు రుజువైనట్లు తెలిపారు. జిల్లాలో కొవిడ్ రోగులకు సరైన వైద్యం అందకపోయినా, ప్రైవేట్ ఆసుపత్రులు ఎక్కువ చార్జీలు వసూలుచేసినా 80082 03288 నెంబర్కు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు తీసుకొంటామన్నారు.