మన భాగ్యనగరిలో ధ్వనించింది... చికాగోలో ప్రతిధ్వనించింది... వివేక శంఖారావం!

ABN , First Publish Date - 2022-02-05T01:14:53+05:30 IST

స్వామి వివేకానంద భాగ్య నగర పర్యటన, చారిత్రక ప్రసంగం నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 13ను వివేకానంద డే గా గుర్తించాలంటూ రామకృష్ణ మఠం వాలంటీర్లు, హైదరాబాద్ యూత్ కొన్ని సంవత్సరాలుగా కోరుతున్నారు.

మన భాగ్యనగరిలో ధ్వనించింది... చికాగోలో ప్రతిధ్వనించింది... వివేక శంఖారావం!

ఫిబ్రవరీ 13... 1893... 129 సంవత్సరాల క్రితం... వేలాది చెవులు విన్నాయి! ఒకే ఒక్క గొంతుక మాట్లాడింది! ఏమని? ఎందుకని? ఎవరి కోసమని? ఈ ప్రశ్నలకి జవాబులు ప్రతీ భాగ్యనగరవాసి తెలుసుకోవాలి! ప్రతీ తెలుగు వాడు గ్రహించాలి! ఎందుకంటే... ఫిబ్రవరీ 13... మనల్ని ఆధునిక భరతజాతి చరిత్రని మలుపుతిప్పిన ఒకానొక మహోన్నత ఘట్టానికి జత చేసే అద్భుత క్షణం కాబట్టి...  


హైదరాబాద్: స్వామి వివేకానంద 1893 ఫిబ్రవరి 10 నుంచి 17 వరకూ భాగ్యనగరంలో పర్యటించి ఫిబ్రవరి 13న సికింద్రాబాద్ మహబూబ్ కాలేజీలో మై మిషన్ టు ద వెస్ట్ (పాశ్చాత్యానికి వెళ్లడంలోని నా ఉద్దేశం) అనే అంశంపై తొలి చారిత్రక ప్రసంగం చేశారు. యూరోపియన్లు, మేధావులు, విద్యావేత్తలు, యువకులు సహా సుమారు వెయ్యిమంది హాజరైన భారీ బహిరంగసభను ఉద్దేశించి ప్రసంగించడం స్వామి వివేకానంద జీవితంలో అదే తొలిసారి. ఆంగ్ల భాషలో ప్రసంగించిన స్వామీజీ సభకు హాజరైన వారిని తన వాగ్ధాటితో మంత్రముగ్ధులను చేశారు. హైందవ ధర్మ ప్రాశస్త్యము, సంస్కృతి, వేద వేదాంత భావనలు, పురాణాలు బోధించే నైతిక ఆదర్శాలు ఇలా అనేక అంశాల గురించి స్వామి వివేకానంద వివరించారు. భారత దేశ ఔన్నత్యాన్ని, బహుముఖంగా చాటి చెప్పడంతో పాటు పాశ్చాత్య దేశాలకు వెళ్లడంలోని తన ఉద్దేశాన్ని వ్యక్తం చేశారు. భారత దేశాన్ని నూతన జవసత్వాలతో పునరుజ్జీవింపచేయాలనే ఉద్దేశంతోనే చికాగో వెళ్లాలనుకుంటున్నట్లు స్పష్టం చేశారు. అమెరికాలోని చికాగోలో విశ్వమత ప్రతినిధుల సభలో పాల్గొనడానికి వెళ్లే ముందు హైదరాబాద్‌ బహిరంగ సభలో ప్రసంగించడం ద్వారా తన ఉపన్యాస నైపుణ్యాలను పరీక్షించుకున్నట్లు స్వామి వివేకానంద తన శిష్యులతో స్వయంగా చెప్పారు. స్వామి వివేకానందలో ఆత్మవిశ్వాసం ఇనుమడింపచేసిన భాగ్యనగర పర్యటన ఆ తర్వాత విశ్వవేదికపై జైత్రయాత్ర కొనసాగేలా చేసింది. 








స్వామి వివేకానంద భాగ్య నగర పర్యటన, చారిత్రక ప్రసంగం నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 13ను వివేకానంద డే గా గుర్తించాలంటూ రామకృష్ణ మఠం వాలంటీర్లు, హైదరాబాద్ యూత్ కొన్ని సంవత్సరాలుగా కోరుతున్నారు. అనేకమంది మేధావులను, విద్యావేత్తలను, విద్యార్ధినీ విద్యార్ధులను కలుస్తున్నారు. స్వామి వివేకానంద హైదరాబాద్ పర్యటన ప్రాధాన్యత గురించి వివరిస్తున్నారు. సంతకాల సేకరణ చేస్తున్నారు. వేలాది మంది ఇప్పటికే తమ మద్దతును తెలియజేశారు. 




భరతమాత స్వేచ్ఛ కోసం పోరాటం చేసిన బాల గంగాధర్ తిలక్ నుంచి సుభాష్ చంద్రబోస్ వరకూ అనేకమంది స్వాతంత్ర్య పోరాట వీరులకు స్ఫూర్తిగా నిలిచిన స్వామి వివేకానందతో భాగ్యనగరానికున్న అనుబంధం తెలంగాణకే గర్వకారణం. స్వామి వివేకానంద పాదస్పర్శతో భాగ్యనగరం పవిత్రభూమిగా మారిన సందర్భాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరి 13ను వివేకానంద డే గా గుర్తించాలని యువత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తోంది.

Updated Date - 2022-02-05T01:14:53+05:30 IST