బె‘ధర’గొడుతున్నాయ్‌!

ABN , First Publish Date - 2020-11-29T17:49:27+05:30 IST

పూల ధరలు ప్రజలను బెదరగొడుతున్నాయి..

బె‘ధర’గొడుతున్నాయ్‌!

విజయనగరం(ఆంధ్రజ్యోతి): పూల ధరలు ప్రజలను బెదరగొడుతున్నాయి. ఎన్నడూ లేనంతగా మూర ధర రూ.100 పైనే పలకడంతో కొను గోలుదారులు బెంబేలెత్తిపోతున్నారు. వాస్తవంగా కార్తీకమాసంలో పూలకు అధిక డిమాండ్‌ ఉంటుంది.  శుభకార్యాలు, పూజలు ఉండడంతో అత్యధికులు వాటిని కొనుగోలు చేస్తుంటారు. అయితే వర్షాభావం తదితర కారణాలతో ఈ సీజన్‌లో వాటి ఉత్పత్తి తగ్గినట్లు రైతులు చెబుతున్నారు. వివిధ కారణాలతో కొన్ని ప్రాంతాల్లో సాగు గణనీయంగా తగ్గింది. ఈ నేపథ్యంలో దిగుబడి తగ్గడంతో కార్తీకంలో పూల ధరలు అమాంతంగా పెరిగాయని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. జిల్లాలో నెల్లిమర్ల, పూసపాటిరేగ, భోగాపురం, సాలూరు, రామభధ్రపురం, బొబ్బిలి, ఎస్‌కోట తదిర ప్రాంతాల్లో సాగైన పూలు ఇతర రాష్ర్టాలకు ఎగుమతి కావడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని వారు తెలియజేస్తున్నారు. ఆదివారం పౌర్ణమి, మూడో సోమవారం కావడంతో పూల ధరలకు రొక్కలొచ్చినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా  గత ఏడాది  మూర కనకాంబరాల ధర రూ.20 నుంచి రూ.25 వరకు ఉండగా ఈ సారి రూ.80 నుంచి రూ.100 వరకు పెరిగింది. మల్లె పూల మూర ధర రూ.70 నుంచి రూ.80 పలుకుతుంది. బంతిపూలు కేజీ రూ. 1000 వరకు విక్రయిస్తున్నారు. వాటితో పాటు పూజ సామగ్రి ధరలు నింగినంటాయి. ఫ  కరోనా నేపథ్యంలో  గత ఏడాదితో  పోలిస్తే  సుమారు 60 శాతం వరకు జిల్లాలో మాలధారణ భక్తులు తగ్గినట్లు తెలుస్తోంది. కరోనా ప్రభావం అన్ని రంగాలపై పడడంతో ఈ సారి వ్యాపారులు, ప్రైవేట్‌ ఉద్యోగులు తదితరులు అయ్యప్ప, భవాని, శివ మాలధారణకు దూరంగా ఉన్నారు. వైరస్‌ ముప్పు ఇంకా పొంచి ఉండడం మరో కారణమని భక్తులు తెలియజేస్తున్నారు. మరోవైపు పెరిగిన నిత్యావసర, కూరగాయలు ధరలు కూడా దీక్షాపరులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. 


Updated Date - 2020-11-29T17:49:27+05:30 IST