సమస్యలు పరిష్కరించండి
ABN , First Publish Date - 2021-11-25T06:38:40+05:30 IST
సమస్యలు పరిష్కరించండి
వీవోఏల ధర్నాలో డిమాండ్
విజయవాడ సిటీ, నవంబరు 24 : మూడేళ్ల కాలపరిమితితో కూడిన సర్క్యులర్ రద్దు చేయాలని, పెండింగ్లో ఉన్న బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని వైఎస్సార్ క్రాంతి పథకంలో పని చేస్తున్న యూనిమేటర్స్ (వీవోఏ)లు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఏపీ వెలుగు యానిమేటర్స్ ఉద్యోగుల సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ధర్నాచౌక్లో బుధవారం ధర్నా నిర్వహించారు. తమ సమస్యలు ప్రభుత్వం పరిష్కరించకుంటే రాబోయే బడ్జెట్ సమావేశాల్లో ‘చలో విజయవాడ’ కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించారు. ప్రభుత్వ పథకాలను పేదలకు చేరవేయడంలో కీలకపాత్ర పోషిస్తున్న తమ వేతనాల్లో కోతలు విధించడం సరైంది కాదన్నారు. గ్రామ సంఘం తీర్మానం లేకుండా రాజకీయ నాయకులు, అధికారులు అక్రమంగా వీవోఏలను తొలగిస్తున్నారని, దీంతో అనేక ఏళ్ల నుంచి పనిచేస్తున్న వీవోఏలకు ఉపాధి లేక రోడ్డున పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చర్యలకు పాల్పడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రూ.10 లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం అమలు చేయాలని కోరారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ధనలక్ష్మి, జిల్లా గౌరవాధ్యక్షురాలు ఎ.కమల, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎ.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం గొల్లపూడిలోని డీఆర్డీఏ ప్రాజెక్టు జిల్లా డైరెక్టర్కు యూనియన్ నాయకత్వ బృందం వినతిపత్రం అందజేసింది.