ఎన్నికల ప్రచారంలో వలంటీర్లు
ABN , First Publish Date - 2021-11-09T05:37:02+05:30 IST
ఎన్నికల ప్రచారంలో వలంటీర్లు
జగ్గయ్యపేటలో ఎలక్షన్ నిబంధనలకు తూట్లు
జగ్గయ్యపేట, నవంబరు 8 : జగ్గయ్యపేట పురపాలక సంఘ ఎన్నికల్లో ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కేస్తున్నారు. కమిషనర్, సహాయ ఎన్నికల అధికారి సుభాష్ చంద్రబోస్ హెచ్చరికలు బేఖాతరు చేస్తూ ఎన్నికల ప్రచారంలో వలంటీర్లు పాల్గొంటున్నారు. అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్ల మేరకే ఇలా జరుగుతోంది. ఎన్నికల ప్రచారాల్లో పాల్గొంటే చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించినా ఫలితం లేదు. కొంతమంది వలంటీర్లు ఫోన్ల ద్వారా వైసీపీకి ఓటేయాలని కోరుతు న్నారు. వైసీపీ అభ్యర్థులు ఓడిపోతే పథకాలు ఆపేస్తారని హెచ్చరిస్తున్నారు. కొన్ని వార్డుల్లో అధికార పార్టీ నేతల వెంట పార్టీ కండువాలు కప్పుకొని ప్రచారం చేస్తుండగా, మరికొన్ని వార్డుల్లో ఎవరికీ కనిపించకుండా ఒక్కరే వెళ్లి చెప్పి వస్తున్నారు. సోమవారం ఉదయం పట్టణంలోని వినాయకుడి గుడి వద్ద వార్డు వలంటీరు ఇంటింటి ప్రచారం చేస్తుండగా, టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. 10, 31, 1, 2 వార్డుల్లో ప్రచారాలపై స్వతంత్ర అభ్యర్థులతో పాటు టీడీపీ అభ్యర్థులు ఫిర్యాదులు చేశారు.