వలంటీర్ బెదిరింపులు
ABN , First Publish Date - 2021-01-16T06:00:19+05:30 IST
‘1902కు ఫిర్యాదు చేస్తావా? నీ కార్డు ఆపుతా.
శిరివెళ్ల, జనవరి 15: ‘1902కు ఫిర్యాదు చేస్తావా? నీ కార్డు ఆపుతా. ఊర్లో ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో’ అంటూ ఓ వలంటీరు బెదిరించారు. ఈ ఘటన శిరివెళ్ల మండలం యర్రగుంట్ల మేజర్ గ్రామపంచాయతీలో శుక్రవారం చోటు చేసుకుంది. బాధితుడి వివరాల మేరకు.. యర్రగుంట్లకు చెందిన షేక్ మదార్వలికి గతంలో రేషన్ కార్డు (డబ్ల్యూఏపీ 133602200075) ఉంది. రెండు నెలల క్రితం ఆయన రేషన్కార్డు తొలగించడంతో వలంటీర్ ద్వారా యర్రగుంట్ల సచివాలయం-2 అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. వారి నుంచి సరైన స్పందన లేకపోవడంతో ప్రభుత్వ టోల్ఫ్రీ నెంబర్ 1902కు శుక్రవారం మధ్యాహ్నం ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో సదరు వలంటీర్ బాధితుడికి ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. బియ్యం కార్డు ఆపుతానని హెచ్చరించారు. వలంటీర్ ఇలా వ్యవహరిస్తే అర్హులైన వారికి న్యాయం ఎలా జరుగుతుందని బాధితుడు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై ఇన్చార్జి ఎంపీడీవో సాల్మన్, యర్రగుంట్ల గ్రామ పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర్లును వివరణ కోరగా లబ్ధిదారుడితో దరుసుగా ప్రవర్తించిన వలంటీర్పై తగిన చర్యలు తీసుకుంటామన్నారు.