యానాంలో వలంటీర్‌ దారుణహత్య

ABN , First Publish Date - 2021-07-30T05:42:25+05:30 IST

యానాంలో మద్యం షాపు దగ్గర జరిగిన గొడవ కారణంగా గురువారం ఇద్దరు వ్యక్తులపై విచక్షణారహితంగా కత్తులతో దాడి చేశారు.

యానాంలో వలంటీర్‌ దారుణహత్య

యానాం, జూలై 29: యానాంలో మద్యం షాపు దగ్గర జరిగిన గొడవ కారణంగా గురువారం ఇద్దరు వ్యక్తులపై విచక్షణారహితంగా కత్తులతో దాడి చేశారు. ఈ సంఘటనలో ఐ.పోలవరం మండలం పెదమడి గ్రామానికి చెందిన వలంటీర్‌ లంక రాజబాబు(27) మృతి చెందాడు. అదే గ్రామానికి చెందిన మరోవ్యక్తి కాశి శ్రీనివాసరావు (రేషన్‌ వ్యాన్‌ డ్రైవర్‌) తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి.  రాజబాబు, శ్రీనివాసరావు యానాం బైపాస్‌రోడ్డులో ఉన్న మద్యం షాపు వద్ద మద్యం సేవిస్తున్నారు. అదే సమయంలో రాజమహేంద్రవరం, పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు తదితర ప్రాంతాలకు చెందిన ఐదుగురు యువకులు అక్కడకు దగ్గరలో ఉన్నారు.   అయితే వారికి, వీరికి మధ్య గొడవ చెలరేగింది. దీంతో  ఐదుగురు వ్యక్తుల బృందంలో ఒకరు రాజబాబు, శ్రీనుపై కత్తితో విచక్షణాహితంగా దాడి చేసి పారిపోయాడు. రాజబాబును స్థానికుల సహాయంతో యానాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను మృతి చెందాడు.  తీవ్రగాయాలతో ఉన్న కాశి శ్రీనివాసరావును మెరుగైన చికిత్స నిమిత్తం కాకినాడ తరలించారు. ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.  యానాం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-07-30T05:42:25+05:30 IST