ఒమైక్రాన్ ఎఫెక్ట్.. రాష్ట్రంలో మరిన్ని ఆంక్షలు
ABN , First Publish Date - 2021-12-04T18:12:04+05:30 IST
దేశంలోనే ఒమైక్రాన్ వేరియంట్ కేసులు బెంగళూరులో నమోదు కావడంతో రాష్ట్రమంతటా ఒక్కసారిగా నిఘా పెంచారు. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం దాకా ఓ వైపు ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, మరోవైపు
- మరింత పెరిగిన నిఘా
- దక్షిణాఫ్రికా వాసుల కోసం గాలింపులు
- మంత్రులు, అధికారులతో సీఎం సమీక్ష
బెంగళూరు: దేశంలోనే ఒమైక్రాన్ వేరియంట్ కేసులు బెంగళూరులో నమోదు కావడంతో రాష్ట్రమంతటా ఒక్కసారిగా నిఘా పెంచారు. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం దాకా ఓ వైపు ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, మరోవైపు ఆరోగ్యశాఖ మంత్రి సుధాకర్ నిరంతరంగా ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహించారు. సీఎం ఢిల్లీ నుంచి బెంగళూరుకు చేరుకోగానే పలువురు కీలకమంత్రులతో సమావేశమయ్యారు. మధ్యాహ్నం కొవిడ్ టాస్క్ఫోర్స్ కమిటీ, వైద్యనిపుణులు కీలక మంత్రులతో అధికారిక నివాసం కృష్ణలో సమీక్షించారు. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విద్యాసంస్థల కొనసాగింపులో మార్పులు లేకున్నా జనవరి 15 వరకు ఎటువంటి కార్యక్రమాలు పాఠశాలలు, కళాశాలల్లో కొనసాగరాదని ఆదేశించారు. విద్యార్థులను వదిలేందుకు వచ్చే తల్లిదండ్రులతోపాటు ప్రభుత్వ ఉద్యోగులు, సినిమాలు, మాల్స్కు వెళ్లేవారు తప్పనిసరిగా రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకోవాల్సి ఉంటుంది. వైద్యసిబ్బంది, 65 ఏళ్లు పైబడినవారికి ఆరోగ్యంలో మార్పులు ఉంటే కొవిడ్ టెస్టులు తప్పనిసరి చేశారు. సభలు, సమావేశాలు, వివాహాలలో 500 మంది పాల్గొనేందుకు అనుమతి ఉన్నా కొవిడ్ నిబంధనలు నిర్వాహకులే పర్యవేక్షించాలని, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్, వ్యాక్సినేషన్తోపాటు కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా ఆదేశించారు. మాస్క్ తప్పనిసరి చేస్తూ ఉల్లంఘిస్తే బెంగళూరులో రూ.250, రాష్ట్రవ్యాప్తంగా రూ. 100 జరిమానా విధించాలని నిర్ణయించారు. కొవిడ్ కేసులు నమోదైన ప్రాంతాలను మైక్రో కంటైన్మెంట్ జోన్లుగా గుర్తించి పర్యవేక్షిస్తారు. కేరళ, మహారాష్ట్ర సరిహద్దు జిల్లా ల్లో చెక్పోస్టులలో మరింత కఠిన నిబంధనలు అమలు చేస్తారు. ఒమైక్రాన్ వేరియంట్ కట్టడికి సమష్టిగా పనిచేద్దామని సీఎం పిలుపునిచ్చారు. ఒమైక్రాన్ వేరియంట్ వైరస్ సోకిన డాక్టర్ భార్యకు కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఆర్బీఐ లే అవుట్లోని డాక్టర్ ఇంటిని సీల్డౌన్ చేశారు. వంద మీటర్ల పరిధిలో బీబీఎం పీ బ్యారికేడ్లను అమర్చింది. వారి నివాసం చుట్టూ ఉండేవారిపై నిఘా కొనసాగించారు. లక్షణాలు కనిపిస్తే కొవిడ్ టెస్టులు చేయాలని నిర్ణయించారు. డాక్టర్ భార్య విక్టోరియాలో పనిచేస్తున్న మేరకు ఆమె నుంచి ఇటీవల చికిత్సలు పొందినవారి వివరాలను సేకరిస్తున్నారు. డాక్టర్ నివాసాన్ని కంటైన్మెంట్ జోన్గా ప్రకటించారు. కాగా నవంబరు 12 నుంచి 22 వరకు బెంగళూరుకు వచ్చి ఆచూకీ లేకుండా పోయిన 10 మంది దక్షిణాఫ్రికా వాసుల కోసం గాలిస్తున్నారు. మరోవైపు దక్షిణాఫ్రికా నుంచి నవంబరు 20న బెంగళూరుకు వచ్చి పాజిటివ్ నిర్ధారణ అయ్యాక 14 రోజుల పాటు క్వారంటైన్లో గడపకుండా మూడురోజుల్లోనే నెగటివ్ రిపోర్టుతో దుబాయ్ వెళ్లిపోవడం వెనుక ఎవరి నిర్లక్ష్యం అనే కోణంలో విచారణ చేయాలని హైగ్రౌండ్ పోలీసులను ఆదేశించారు. నగరవ్యాప్తంగా కొత్త ఆంక్షలు శనివారం నుంచి అమలులోకి రానున్నట్టు ప్రకటించారు. అ యితే రాష్ట్రంలో కొత్త ఆంక్షలు విధించినా భారీగా మార్పులు ఉండవని తెలుస్తోంది.