డిజిటల్ రూపంలోకి ఓటర్ ఐడీ కార్డులు.. అసెంబ్లీ ఎన్నికలకు ముందే అందుబాటులోకి!

ABN , First Publish Date - 2021-01-25T00:26:12+05:30 IST

ఓటర్ గుర్తింపు కార్డులు ఇకపై డిజిటల్ రూపంలోకి మారిపోనున్నాయి. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని

డిజిటల్ రూపంలోకి ఓటర్ ఐడీ కార్డులు.. అసెంబ్లీ ఎన్నికలకు ముందే అందుబాటులోకి!

న్యూఢిల్లీ: ఓటర్ గుర్తింపు కార్డులు ఇకపై డిజిటల్ రూపంలోకి మారిపోనున్నాయి. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం (25వ తేదీ) నుంచి  ఈ-ఎపిక్ (ఎలక్ట్రానిక్ ఎలక్టోరల్ ఫొటో ఐడెంటిటీ కార్డ్-ఈపీఐసీ) కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఎలక్షన్ కమిషన్ సిద్ధమైంది. అసోం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందే దేశవ్యాప్తంగా ఓటర్లందరికీ డిజిటల్ ఈపీఐసీ అందుబాటులోకి రానున్నట్టు తెలుస్తోంది.


ఈ-ఎపిక్ విధానాన్ని ఎన్నికల సంఘం రెండు దశల్లో ప్రారంభించనుంది. ఈ నెల 25-31 మధ్య చేపట్టనున్న తొలి దశలో ఓటరు కార్డు కోసం కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారు, ఫామ్-6లో తమ మొబైల్ నంబర్లను రిజిస్టర్ చేసుకున్న వారు తమ ఈ-ఎపిక్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అయితే, ఇందులో రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నంబర్లు గతంలో ఈసీఐ ఎలక్టోరల్ రోల్స్‌లో నమోదు చేసినవై ఉండకూడదు. 


ఫిబ్రవరి 1 నుంచి రెండో దశ మొదలవుతుంది. ఈ దశలో సాధారణ ఓటర్లు ఈ-ఎపిక్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఓటరు కార్డుతో తమ మొబైల్ నంబరు అనుసంధానమై ఉన్నవారు ఈ-ఎపిక్‌ను డౌన్‌లోడు చేసుకోవచ్చని ఎన్నికల కమిషన్ అధికారి ఒకరు తెలిపారు.  


ఈ-ఎపిక్ అంటే ఏమిటి? 

ఈ-ఎపిక్ అనేది సవరించడానికి వీలు లేని సురక్షిత పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్ (పీడీఎఫ్) వెర్షన్‌. సీరియల్ నంబరు, పార్ట్ నంబరు వంటివి ఉంటాయి. సురక్షితమైన క్యూఆర్ కోడ్ కలిగి ఉంటుంది. ఈ-ఎపిక్‌ను మొబైల్ ద్వారా కానీ, కంప్యూటర్ ద్వారా కానీ డౌన్‌లోడ్ చేసుకుని డిజిటల్‌గా భద్రపరుచుకోవచ్చు. 

Updated Date - 2021-01-25T00:26:12+05:30 IST