AP News: ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటర్ల నమోదు ప్రక్రియకు ఈసీ ఆదేశం
ABN , First Publish Date - 2022-10-01T01:18:06+05:30 IST
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటర్ల నమోదు ప్రక్రియకు ఈసీ ఆదేశించింది. 2023 మార్చి 29తో 6 ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుంది.
అమరావతి: ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటర్ల నమోదు ప్రక్రియకు ఈసీ ఆదేశించింది. 2023 మార్చి 29తో 6 ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుంది. ప్రకాశం, కడప టీచర్ల ఎమ్మెల్సీ స్థానాలు, ప్రకాశం, కడప, శ్రీకాకుళం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈ ఎన్నికలకు అక్టోబరు 1 నుంచి ఓటర్ల నమోదుకు అవకాశం ఉంది. నవంబరు 23న ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల చేయనున్నారు. డిసెంబరు 23న తుది ఓటర్ల జాబితా విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పట్టభద్ర, ఉపాధ్యాయ ఓటర్ల నమోదుకు షెడ్యూల్ విడుదలైంది. అక్టోబరు ఒకటో తేది నుంచి చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం ఉమ్మడి జిల్లాల్లో ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. 2019 అక్టోబరు 31వ తేది నాటికి డిగ్రీ ఉత్తీర్ణులైన వారే ఓటరుగా నమోదుకు అర్హులు. పట్టభద్రులైతే డిగ్రీ మార్కుల జాబితా, ఉపాధ్యాయులైతే ప్రధానోపాధ్యాయుడు ఇచ్చే సర్టిఫికెట్ను ఓటరు నమోదు దరఖాస్తుకు జత చేయాలి. ఓటరు నమోదుకు గ్రాడ్యుయేట్లు ఫారం-18, ఉపాధ్యాయులు ఫారం-19 అందజేయాలి. ఓటర్లుగా చేరేందుకు కలెక్టరేట్, తహసీల్దారు కార్యాలయాల్లో, ఆన్లైన్లో లేదా బీఎల్వోల వద్ద నమోదు చేసుకోవచ్చు. వీటి స్వీకరణకు నవంబరు 7వ తేది వరకు గడువు ఉంటుంది. నవంబరు 23న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురిస్తారు. ఆ రోజు నుంచి డిసెంబరు 9వ తేది వరకు దీనిపై అభ్యంతరాలు స్వీకరిస్తారు. డిసెంబరు 30న తుది ఓటరు జాబితా ప్రచురిస్తారు.
మార్చిలోగా ఎమ్మెల్సీ ఎన్నికలు
చిత్తూరు- నెల్లూరు- ప్రకాశం నియోజకవర్గాల ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ యండవల్లి శ్రీనివాసులు, ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీగా విఠపు బాలసుబ్రహ్మణ్యం 2017లో ఎన్నికయ్యారు. వీరి ఆరేళ్ల పదవీ కాలం 2023 మార్చి 29వ తేదీతో ముగియనుంది. దీంతో మార్చి నెలాఖరులోగా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. దీనికోసం అప్పుడే ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు టీచర్లు, పట్టభద్రుల్లో కలకలం ప్రారంభమైంది. ఎన్నికల్లో తాము పోటీచేస్తున్నామంటూ అప్పుడే అభ్యర్థులు ప్రచారాలూ ప్రారంభించారు.