ఓటుతోనే ప్రజాస్వామ్యం: కలెక్టర్
ABN , First Publish Date - 2022-01-26T05:11:36+05:30 IST
ఓటుతోనే ప్రజాస్వామ్యం వర్థిల్లుతుందని , ఓటు సామాన్యుడి చేతిలో వజ్రాయుధమని కలెక్టర్ పి.కోటేశ్వరరావు అన్నారు.
కర్నూలు(కలెక్టరేట్), జనవరి 25: ఓటుతోనే ప్రజాస్వామ్యం వర్థిల్లుతుందని , ఓటు సామాన్యుడి చేతిలో వజ్రాయుధమని కలెక్టర్ పి.కోటేశ్వరరావు అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సునయనలో 12వ జాతీయ ఓటర్ల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా కలెక్టర్ పి.కోటేశ్వరరావు, జిల్లా జడ్జి డా.వి.రాధాకృష్ణా కృపాసాగర్ హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని 2011 నుంచి ప్రతి ఏటా జనవరి 25న జరుపుకుంటు న్నామన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు విలువను తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా జడ్జి డా.వి.రాధాకృష్ణా కృపాసాగర్ మాట్లాడుతూ సమాజంలో మార్పు కోసం ఓటును తప్పనిసరిగా వినియోగించుకోవాలన్నారు. కుల, మతాలకు అతీతంగా ఓటు వేయాలన్నారు. పౌరులకు మన రాజ్యాంగం కల్పించిన హక్కు ఓటు అన్నారు. అనంతరం 18 ఏళ్లు నిండి కొత్తగా ఓటరుగా నమోదు చేసుకున్న యువతకు సన్మానించి ఎపిక్ కార్డులను అందజేశారు. ఇన్చార్జి డీఆర్వో మల్లికార్జునుడు, కర్నూలు ఆర్డీవో హరిప్రసాద్, జిల్లా స్థాయి అధికారులు, కర్నూలు అర్బన్, కల్లూరు తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.
కర్నూలు(ఎడ్యుకేషన్): జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో మంగళవారం కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. బి.క్యాంపు ప్రభుత్వ వృత్తి విద్య జూనియర్ కళాశాలలో జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ నాగస్వామి నాయక్ మాట్లాడుతూ ప్రజాస్వామిక వ్యవస్థలో ఓటు హక్కుకు అత్యంత ప్రాధాన్యత ఉందని అన్నారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ విజయశేఖర్; ప్రసన్న, గీతావాణి, ఎన్ఎస్ఎస్ వలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.
కర్నూలు (కల్చరల్): మహిళలకు ఓటుహక్కు, రిజర్వేషన్లు రాజ్యాంగం కల్పించిందని ఏపీ బీసీ చైతన్య సమితి జిల్లా అధ్యక్షురాలు రమీజాబీ అన్నారు. మంగళవారం జాతీయ ఓటు హక్కు దినోత్సవం సందర్భంగా స్థానిక పాతబస్టాండులోని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి సమితి ఆధ్వర్యంలో మహిళలు క్షీరాభిషేకం నిర్వహించి మహిళల హక్కులను ప్రభుత్వాలు కాపాడాలని డిమాండ్ చేశారు. చైతన్య సమితి మహిళా నాయకులు అభిబా, షేక్ జరీనా, హషనాజ్, సుమలత తదితరులు పాల్గొన్నారు.