కరోనా నయం చేస్తానంటూ కొద్ది రోజులుగా మందుల విక్రయం.. విషయం తెలిసి..
ABN , First Publish Date - 2020-08-06T17:44:13+05:30 IST
ఐసీఎంఆర్ నిబంధనలకు విరుద్ధంగా కోవిడ్-19 చికిత్స చేస్తున్నారని బాలసముద్రంలోని హోమియో వైద్యుడు డాక్టర్ వీఎ్సరెడ్డి ఆస్పత్రిని అధికారులు సీజ్ చేశారు. పాండమిక్ మెడికల్ డిజాస్ట్ మేనేజ్మెంట్
డాక్టర్ వీఎస్ రెడ్డి హోమియో ఆస్పత్రి సీజ్
హన్మకొండ అర్బన్(ఆంధ్రజ్యోతి): ఐసీఎంఆర్ నిబంధనలకు విరుద్ధంగా కోవిడ్-19 చికిత్స చేస్తున్నారని బాలసముద్రంలోని హోమియో వైద్యుడు డాక్టర్ వీఎ్సరెడ్డి ఆస్పత్రిని అధికారులు సీజ్ చేశారు. పాండమిక్ మెడికల్ డిజాస్ట్ మేనేజ్మెంట్ చట్టం కింద ఆస్పత్రిని సీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. రెండు రోజులుగా డాక్టర్ వీఎస్ రెడ్డి కరోనాను నయం చేస్తానంటూ మందులు విక్రయించారు. ఎలాంటి మాస్క్లు వాడొద్దని చేస్తున్న ప్రకటనల విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. వెంటనే ఆయూష్ డైరెక్టర్ డాక్టర్ ఆల్గువర్షిణి జిల్లా అధికారులను పురమాయించారు. ఇన్చార్జి కలెక్టర్ హరిత సూచనమేరకు అడిషనల్ డీఎంహెచ్వో డాక్టర్ మదన్మోహన్, ఆయూష్ ఆర్డీడీ డాక్టర్ రవినాయక్ ఆధ్వర్యంలో హన్మకొండ తహసీల్దార్ కిరణ్ ప్రకాష్ ఆస్పత్రికి బుధవారం రాత్రి పోలీసుల బందోబస్తుతో వచ్చారు. ఈ క్రమంలో అధికారులకు వివిధ రకాల ఒత్తిళ్లు రాగా, ఎట్టకేలకు కలెక్టర్ జోక్యంతో ఆస్పత్రిని సీజ్ చేశారు.
ఈ ఘటనపై ఆయూష్ డైరెక్టర్ డాక్టర్ ఆల్గు వర్షిణి త్రిసభ్యకమిటీని నియమించారు. ఆయూష్ వైద్యుడు లింగరాజు, డ్రగ్ ఇన్స్పెక్టర్ పార్థసారథి, వైద్యాధికారి డాక్టర్ లక్ష్మినారాయణను నియమించారు. కాగా, డాక్టర్ వీఎస్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తన వైద్యం సరైనదేనని, కావాలనే కుట్ర పన్ని తన వైద్యాన్ని అణగదొక్కేందుకే ఆస్పత్రిని సీజ్ చేశారని అన్నారు. కరోనాపై తన వైద్యం పనితీరును నిరూపించేందుకు ఎప్పటికైనా సిద్ధమేనని ప్రకటించారు.