ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించండి

ABN , First Publish Date - 2021-02-28T06:39:33+05:30 IST

ఈ నెల పదిన జీవీఎంసీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అన్ని రాజకీయ పక్షాలు సహకరించాలని జీవీఎంసీ కమిషనర్‌ ఎస్‌.నాగలక్ష్మి కోరారు.

ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించండి
రాజకీయ పార్టీలతో సమావేశమైన కమిషనర్‌ నాగలక్ష్మి

రాజకీయపార్టీలకు జీవీఎంసీ కమిషనర్‌ నాగలక్ష్మి విజ్ఞప్తి

విశాఖపట్నం, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): ఈ నెల పదిన  జీవీఎంసీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అన్ని రాజకీయ పక్షాలు సహకరించాలని జీవీఎంసీ కమిషనర్‌ ఎస్‌.నాగలక్ష్మి కోరారు. జీవీఎంసీ సమావేశ మందిరంలో శనివారం నగరంలోని అన్నిరాజకీయ పార్టీల నేతలతో ఆమె సమావేశమయ్యారు. ఓటర్ల జాబితా మొదలుకుని పోలింగ్‌ నిర్వహణ, లెక్కింపు వరకూ జరిగే ప్రక్రియలను రాజకీయ పార్టీల నేతలకు వివరించారు. ఎన్నికలకు చేపడుతున్న ఏర్పాట్లను వివరించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి పాటించాల్సిన ఆవశ్యకతను, ఉల్లంఘిస్తే ఎదురయ్యే సమస్యలపై అవగాహన కల్పించారు.  ఓటు హక్కు వినియోగంపై జీవీఎంసీతోపాటు రాజకీయ పార్టీలు కూడా ప్రజలను చైతన్యపరచాలని కోరారు. ఎన్నిలకు సంబంధించిన అంశాలపై ఫిర్యాదు చేసేందుకు ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్‌ను ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్‌లు ఏవీ రమణి, ఆశాజ్యోతి, డాక్టర్‌ వి.సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-02-28T06:39:33+05:30 IST