ప్రభుత్వరంగ సంస్థల పరిరక్షణ బాధ్యత ప్రభుత్వాలదే
ABN , First Publish Date - 2021-04-22T05:25:23+05:30 IST
ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించుకోవలసిన బాధ్యత ప్రభుత్వాలదేనని టీడీపీ సీనియర్ నాయకుడు పులి వెంకట రమణారెడ్డి అన్నారు.
టీడీపీ సీనియర్ నాయకుడు పులి వెంకట రమణారెడ్డి
69 రోజు కొనసాగిన ఉక్కు ఉద్యోగుల రిలే దీక్షలు
కూర్మన్నపాలెం, ఏప్రిల్ 21: ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించుకోవలసిన బాధ్యత ప్రభుత్వాలదేనని టీడీపీ సీనియర్ నాయకుడు పులి వెంకట రమణారెడ్డి అన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెంలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఉద్యోగులు నిర్వహిస్తున్న రిలే దీక్షలు 69వ రోజు కూడా కొనసాగాయి. బుధవారం ఈ దీక్షలలో సింటర్ ప్లాంట్ విభాగం కార్మికులు కూర్చున్నారు. ఈ దీక్షా శిబిరంలో పులి వెంకట రమణా రెడ్డి మాట్లాడుతూ ఉక్కు పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని పిలుపు నిచ్చారు. సీపీఎం నాయకుడు ఎన్.రామారావు మాట్లాడుతూ స్టీల్ప్లాంట్ నష్టాల్లో ఉండటం వలన ప్రైవేటీకరణ చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేయటం తగదన్నారు. నేషనల్ యాంథమ్ అండ్ ఫ్లాగ్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రజాపతి మాట్లాడుతూ శాంతియుతంగా పోరాటాలు చేయాలని సూచించారు. స్టీల్ప్లాంట్ పరిరక్షణకు అన్ని పార్టీలు కలసి రావాలని డిమాండ్ చేశారు. ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కో కన్వీనర్ గంధం వెంకటరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఈ నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ దీక్షలలో డి.ఆదినారాయణ, గంధం వెంకటరావు, జె.అయోధ్యరామ్. వరసాల శ్రీనివాసరావు, వేములపాటి ప్రసాద్, గంగవరం గోపి, జె.సింహాచలం, బోసుబాబు, మురళీరాజు, రమణారెడ్డి, సన్యాసిరావు, గణపతి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.