టీడీపీ కార్యాలయంలో ఆశావహుల సందడి

ABN , First Publish Date - 2021-03-02T06:36:51+05:30 IST

జీవీఎంసీ ఎన్నికలలో టికెట్లు ఆశించిన అభ్యర్థులు సోమవారం జిల్లా పార్టీ కార్యాలయానికి భారీగా తరలివచ్చారు.

టీడీపీ కార్యాలయంలో ఆశావహుల సందడి
బి ఫారం అందజేస్తున్న అచ్చెన్నాయుడు

అభ్యర్థుల ఎంపికపై నాయకులు చర్చలు

ఇన్‌చార్జీలకు బి ఫారాలు అందజేత

విశాఖపట్నం, మార్చి 1(ఆంధ్రజ్యోతి): జీవీఎంసీ ఎన్నికలలో టికెట్లు ఆశించిన అభ్యర్థులు సోమవారం జిల్లా పార్టీ కార్యాలయానికి భారీగా తరలివచ్చారు. పోటీ ఉన్న వార్డులలో టికెట్‌ కోసం మద్దతుదారులతో కలిసి రావడంతో పార్టీ కార్యాలయం కోలాహలంగా మారింది. కాగా అభ్యర్థుల జాబితా విడుదల సోమవారం ఉదయం ఉంటుందని నేతలు సమాచారంతో మరికొందరు హాజరయ్యారు. అయితే అభ్యర్థుల ఎంపికపై పార్టీ రాష్ట్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, ప్రధాన కార్యదర్శి నిమ్మల రామానాయుడు, జీవీఎంసీ పరిధిలో ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, పి.గణబాబు, ఇన్‌చార్జిలు బండారు సత్యనారాయణ మూర్తి, పీలా గోవింద్‌, చిక్కాల విజయ్‌బాబు, పార్టీ నాయకుడు ఎంవీ భరత్‌లతో చర్చించారు. ఈ సందర్భంగా పార్టీ విశాఖ పార్లమెంటరీ అఽధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు జీవీఎంసీ పరిధిలో కార్పొరేటర్‌ అభ్యర్థుల వివరాలను వెల్లడించారు. అనంతరం సెగ్మెంట్‌ల పరిధిలో అభ్యర్థుల బి ఫారాలను ఇన్‌చార్జిలకు అందజేశారు. ఇంకా మేయరు అభ్యర్థి రేసులో ఉన్న పీలా శ్రీనివాస్‌కు బి.ఫారాన్ని అచ్చెన్నాయుడు అందజేశారు. 


Updated Date - 2021-03-02T06:36:51+05:30 IST