వీఎస్‌యూలో ఎగ్జిక్యూటివ్‌ ఎంబీఏ కోర్సు

ABN , First Publish Date - 2021-02-27T03:49:37+05:30 IST

వీఎస్‌యూ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ విభాగం ఆధ్వర్యంలో ఎగ్జిక్యూటివ్‌ ఎంబీఏ కోర్సు ప్రవేశపెడుతున్నట్లు వీఎస్‌యూ ఇన్‌చార్జ్‌ వైస్‌ చాన్సలర్‌ ఎం. చంద్రయ్య పేర్కొన్నారు.

వీఎస్‌యూలో ఎగ్జిక్యూటివ్‌ ఎంబీఏ కోర్సు
సమావేశంలో మాట్లాడుతున్న ఇన్‌చార్జ్‌ వీసీ చంద్రయ్య

 వెంకటాచలం, ఫిబ్రవరి 26 : వీఎస్‌యూ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ విభాగం ఆధ్వర్యంలో ఎగ్జిక్యూటివ్‌ ఎంబీఏ కోర్సు ప్రవేశపెడుతున్నట్లు వీఎస్‌యూ ఇన్‌చార్జ్‌ వైస్‌ చాన్సలర్‌ ఎం. చంద్రయ్య పేర్కొన్నారు. మండలంలోని కాకుటూరు వద్ద ఉన్న వీఎస్‌యూ పరిపాలన భవనంలోని వీసీ చాంబర్‌లో శుక్రవారం ఆయన విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. జిల్లాలోని ఉద్యోగస్థులు వారి ఉద్యోగాల్లో ప్రగతి సాధించేందుకు రెండేళ్ల  కాలవ్యవధి గల ఎగ్జిక్యూటివ్‌ ఎంబీఏ కోర్సును తీసుకొస్తున్నామన్నారు. డిగ్రీ పొంది నేరుగా ఉద్యోగావకాశాలు అందుకొని, సరైన పదోన్నతులు పొందలేకపోతున్న వారికి ఈ కోర్సు ద్వారా నిర్వాహక, నాయకత్వ నైపుణ్యాలను అందిపుచ్చుకోవచ్చన్నారు. ఏ డిగ్రీ అయినా పాసై ఉండి, ఐదేళ్లు ఉద్యోగ అనుభవం కలిగి ఎగ్జిక్యూటివ్‌, ఆపై హోదాలో పనిచేస్తున్న వారు ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆసక్తిగల వారు వచ్చే నెల 31వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తు రుసుము రూ.1000, రిజిస్ర్టార్‌ విక్రమ సింహపురి యూనివర్సిటీ పేరున డీడీ ద్వారా చెల్లించాలన్నారు. వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో సందర్శించుకోవచ్చన్నారు. సమావేశంలో వీఎస్‌యూ రిజిస్ర్టార్‌ డాక్టర్‌ లేబాకు విజయకృష్ణారెడ్డి, కోర్సు విభాగ అధిపతి జే విజేత తదితరులున్నారు.


విద్యార్థులకు సువర్ణావకాశం

విక్రమ సింహపురి యూనివర్సిటీ పరిధిలోని అనుబంధ కళాశాలలో స్పాట్‌ పీజీ అడ్మిషన్‌ ప్రవేశాలకు వచ్చే నెల 5వ తేదీ   వరకు గడువు పొడిగించినట్లు, ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని వీఎస్‌యూ పీజీ సెట్‌ కన్వీనర్‌ డాక్టర్‌ టీ వీరారెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. వీఎస్‌యూ ప్రవేశ పరీక్ష రాసిన వారు, ఇతర యూనివర్సిటీల ప్రవేశ పరీక్షలు రాసిన విద్యార్థులు అడ్మిషన్లు తీసుకోవాల్సిందిగా కోరుతున్నామన్నారు.  వివరాల కోసం వీఎస్‌యూ వెబ్‌సైట్‌ను సందర్శించాలని కోరారు.   


మంత్రి సురేష్‌ను కలిసిన రిజిస్ర్టార్‌  

రేణిగుంట విమానాశ్రయంలో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ను శుక్రవారం వీఎస్‌యూ రిజిస్ర్టార్‌ డాక్టర్‌ లేబాకు విజయకృష్ణారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి సురేష్‌ని శాలువాతో సన్మానించారు. ఆయన వెంట ఏపీఎస్‌సీహెచ్‌ఈ సెక్రటరీ డాక్టర్‌ సుధీర్‌ ప్రేమకుమార్‌ ఉన్నారు.  

Updated Date - 2021-02-27T03:49:37+05:30 IST