వ్యవసాయ కళాశాలతో మెట్టకు మహర్దశ
ABN , First Publish Date - 2022-07-08T02:42:33+05:30 IST
వ్యవసాయరంగంపై విద్యార్థుల్లో మక్కువ పెంచేందుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఉదయగిరి ప్రాంత విద్యార్థులు వ్య
ఈ ఏడాది వంద మందితో అడ్మిషన్లు
ప్రభుత్వ ఉత్తర్వుల జారీ
ఉదయగిరి, జూలై 7: వ్యవసాయరంగంపై విద్యార్థుల్లో మక్కువ పెంచేందుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఉదయగిరి ప్రాంత విద్యార్థులు వ్యవసాయ కోర్సులకు సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా, ఇక్కడ కళాశాల అందుబాటులోకి రానున్నది. ఉదయగిరికి మరో మణిహారంగా వ్యవసాయ కళాశాలను మంజూరు చేస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఎంఆర్ఆర్ చారిటబుల్ట్రస్టు ప్రాంగణంలో ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి.
విద్యాభివృద్ధిపై మక్కువ
మెట్ట ప్రాంతంలో విద్యను ప్రోత్సహిస్తే అభివృద్ధి జరుగుతుందనే ఆశయంతో మాజీ ఎంపీ రాజమోహన్రెడ్డి ఇక్కడ ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేశారు. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి జ్ఞాపకార్థంగా మెరిట్స్ ఇంజనీరింగ్ కళాశాలను వ్యవసాయ కళాశాలగా ఏర్పాటు చేసుకోవాలని కోరుతూ రూ.250 కోట్ల విలువైన ఆస్తులు ప్రభుత్వానికి అప్పగించారు.
ఈ ఏడాదే అడ్మిషన్లు
మాజీ ఎంపీ రాజమోహన్రెడ్డి విన్నపం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం కమిటీని ఉదయగిరిలోని ఎంఆర్ఆర్ చారిటుబల్ట్రస్టు ఆధ్వర్యంలోని మెరిట్స్ ఇంజనీరింగ్ కళాశాలను సందర్శించి ప్రభుత్వానికి నివేదికలు అందజేయాలని కోరింది. దీంతో కమిటీ ఇటీవల సందర్శించి నివేదికలు ప్రభుత్వానికి అందజేసింది. ఏఎన్జీఆర్ఏయూ, టీఏఆర్ఈ, ఐసీఏఆర్ నిబంధనల ప్రకారం మెరిట్స్లోని అన్ని మౌలిక సదుపాయాలను వినియోగించుకొంటూ ప్రస్తుతం ఉన్న సిబ్బందితో 2022-23 విద్యా సంవత్సరం వంద మంది విద్యార్థులతో ఆడ్మిషన్లు ప్రారంభించాలని ప్రభుత్వం అనుమతిచ్చింది. దీంతో ఉదయగిరి మెట్ట ప్రాంతంలో వ్యవసాయ స్థితిగతులు మారనున్నాయి.