ఘనంగా దసరా
ABN , First Publish Date - 2020-10-27T09:02:57+05:30 IST
ఘనంగా దసరా
భక్తిశ్రద్ధలతో దుర్గాదేవికి పూజలు
కిటకిటలాడిన దేవాలయాలు
విజయనగరం రూరల్/ కురుపాం, అక్టోబరు 26: మూడు రోజుల పండుగ (దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి) ఆదివారంతో ఘనంగా ముగిసింది. దసరాను జిల్లా ప్రజలంతా సందడిగా జరుపుకున్నారు. దుర్గాదేవి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. వాహన పూజలు.. కొత్త వాహనాల ప్రారంభంతో నూతన కళ కనిపించింది. దసరా మంచి రోజు కావడంతో వివిధ వ్యాపార, వాణిజ్య సముదాయాలను కొత్తగా ప్రారంభించారు. కొంత మంది ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన నిర్వహించారు. మరోవైపు పెళ్లిళ్లు కూడా జరిగాయి. జిల్లా కేంద్రమైన విజయనగరంలో పైడితల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వనంగుడిలో చండీయా గాన్ని నిర్వహించారు.
కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తులు పైడిమాంబను దర్శించుకున్నారు. కన్యకాపరమేశ్వరీ, జ్ఞానసరస్వతి, కొత్తపేట, కుమ్మరవీధిలో వున్న దుర్గాదేవి ఆలయాల్లో దసరా వేడుకలను వైభవంగా నిర్వహించారు. విజయనగరంలోని గోవులశాల వద్ద గురుదాస్ మెమోరియల్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయదశమిని పురస్కరించుకుని బేతాళునికి పూజలు చేశారు. ఈ సందర్భంగా పిల్లలు కర్ర, కత్తిసాములను ప్రదర్శించారు.
కురుపాం కోటలో దసరా ఉత్సవాలు
కురుపాం కోటలో దసరా ఉత్సవాలు ప్రత్యేకతను చాటాయి. కేంద్ర మాజీ మంత్రి వైరిచర్ల కిషోర్చంద్రదేవ్ కుటుంబ సమేతంగా ఆదివారం ఆయుధ పూజ నిర్వహించారు. న్యూఢిల్లీకి చెందిన పురోహితులు మేళతాళాల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోటలోని పురాతన ఖడ్గాలు, బల్లేలు, తుపాకీలకు పూజలు చేశారు.