శాస్త్రవేత్తను అవ్వాలనుకున్నా

ABN , First Publish Date - 2021-08-03T05:04:29+05:30 IST

శాస్త్రవేత్తను అవ్వాలనుకున్నా

శాస్త్రవేత్తను అవ్వాలనుకున్నా
కుటుంబసభ్యులతో జడ్జిగా ఎంపికైన తేజశ్రీరెడ్డి

  • సమాజ సేవ చేసేందుకే జడ్జినయ్యా 
  • పేదలకు న్యాయం చేకూర్చడమే లక్ష్యం 
  • జడ్జిగా ఎంపికైన తేజశ్రీరెడ్డి 


పూడూరు: ‘శాస్త్రవేతను కావాలన్నది నా కల.. కానీ పేదలకు న్యాయం చేసేందుకు కష్టపడి జడ్జి అయ్యాను..’ అని ఇటీవల జూనియర్‌ సివిల్‌ జడ్జిగా ఎంపికైన తేజశ్రీరెడ్డి తెలిపారు. పూడూరు మండల కేంద్రానికి చెందిన పట్లోళ్ల వెంకట్‌రెడ్డి, సునందల కుమార్తె తేజశ్రీరెడ్డి జూనియర్‌ సివిల్‌ జడ్జిగా ఎంపిక కావడం పట్ల తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, పూడూరు మండల ప్రజలు హర్షం వ్యక్తంచేశారు. తేజశ్రీరెడ్డి చిన్నప్పటి నుంచి చదువులో ఎంతో చురుకుదనం కనిపించేదని ఆమె తల్లిదండ్రులు తెలిపారు. 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు మండల కేంద్రంలోని పాఠశాలలో , 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు వికారాబాద్‌లోని గురుకుల పాఠశాలలో అభ్యసించింది. ఇంటర్‌ వికారాబాద్‌లోని గౌతమి జూనియర్‌ కళాశాలలో పూర్తిచేసింది. అనంతరం బీఫాం నాంపల్లిలోని సరోజిని వనిత కళాశాలలో, అలాగే ఎల్‌ఎల్‌బీ పడాల రాంరె డ్డి కళాశాలలో 2016-19 వరకు పూర్తి చేసింది. బేసిక్‌గా తనకు చిన్నప్పటి నుంచి శాస్త్రవేత్త అవాలనే కోరిక ఉండేది. ఎదిగే కొద్ది ఎన్నుకున్న సబ్జెక్ట్‌ పరంగా సామాజిక దృక్పథంలో సమాజానికి సేవ అందించాలని పేదవారికి, రైతులకు న్యాయం చేకూర్చాలనే ఉద్దేశ్యంతో కష్టపడి జడ్జిగా ఎంపికైనట్లు తేజశ్రీరెడ్డి తెలిపారు. చిన్నప్పటి నుంచి ఆర్చీరీ నేషనల్‌ గేమ్‌లో కూడా తాను పాల్గొన్నట్లు తెలిపింది. ఎప్పటికైనా అన్యాయాలకు గురవుతున్న పేదలకు న్యాయం చేకూర్చాలన్నదే తన ధ్యేయమని పేర్కొంది.

తండ్రిగా గర్వపడుతున్నా: వెంకట్‌రెడ్డి, తేజశ్రీరెడ్డి తండ్రి 

చిన్నప్పటి  నుంచి నా కూతురిని గొప్ప చదువు చదివించాలని కలలు కన్నాను. వ్యవసాయం చేస్తూ డబ్బులు పొగేసి చదివించాను. తేజశ్రీ జడ్జిగా ఎంపిక కావడం తండ్రిగా గర్వంగా ఉంది.

జడ్జిలుగా ఎంపికైన ఇద్దరికి ఘనంగా సన్మానం

పరిగి: జూనియర్‌ సివిల్‌ జడ్జిలుగా ఎంపికైన ఇద్దరు అభ్యర్థులకు సోమవారం పరిగిలో వేర్వేరుగా ఘనంగా సన్మానించారు. పూడూరు మండల కేంద్రానికి చెందిన తేజశ్రీరెడ్డి, దోమ మండల కేంద్రానికి చెందిన ఎండీ ఉమర్‌లు న్యాయవాదులుగా పనిచేస్తూ జడ్జిలుగా ఎంపికయ్యారు. వీరిద్దరిని సోమవారం పరిగి బార్‌అసోషియేషన్‌ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. అంతకుముందు పరిగి మాజీ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు టి.రామ్మోహర్‌రెడ్డి వారి నివాసంలో సన్మానించారు. కార్యక్రమంలో బార్‌అసోషియేషన్‌ అధ్యక్ష,కార్యదర్శులు రాము, గౌస్‌పాష పాల్గొన్నారు.

Updated Date - 2021-08-03T05:04:29+05:30 IST