HYD : 4.90 లక్షలు దొంగతనం చేసి.. బైక్ తాళం లేకపోవడంతో.. తోసుకుంటూ వెళ్తుండగా...
ABN , First Publish Date - 2021-07-22T17:41:49+05:30 IST
బైక్ తాళం లేకపోవడంతో దానిపై నగదు పెట్టుకుని తోసుకుంటూ వెళ్తుండగా...
- వయస్సు 20.. చోరీలు 29
- కరడుగట్టిన నేరస్థుడి సహా ఆరుగురి అరెస్టు
హైదరాబాద్ సిటీ/జీడిమెట్ల : అర్ధరాత్రి చోరీలు చేసి తప్పించుకు తిరుగుతున్న కరడుగట్టిన నేరస్థుడిని, దొంగిలించిన సొమ్ముతో పారిపోతున్న అతడిని బెదిరించి డబ్బు దోచుకున్న మరో ఐదుగురు వ్యక్తులను జీడిమెట్ల పోలీసులు అరెస్టు చేశారు. షాపూర్నగర్ మార్కెట్లో నివసిస్తూ హోల్సేల్ వ్యాపారం చేస్తున్న బెహరాం చౌదరి రూ. 4.90 లక్షలు దుకాణంలో పెట్టి తాళం వేసి వెళ్లాడు. ఈనెల 9వ తేదీ అర్ధరాత్రి సరూర్నగర్ ప్రాంతానికి చెందిన 29 దొంగతనాలలో నేరస్థుడిగా ఉన్న రమావత్ సైదులు(20) తాళాలు పగులగొట్టి నగదు అపహరించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈనెల 20న వాహనాలను తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా తిరుగుతున్న సైదులును అదుపులోకి తీసుకున్నారు. నేరాన్ని అంగీకరించాడు.
నగదు తీసుకుని మిర్యాలగూడ వెళ్లడానికి ఈనెల 10న వనస్థలిపురం ప్రాంతంలో బైక్ అపహరించాడు. బైక్ తాళం లేకపోవడంతో దానిపై నగదు పెట్టుకుని తోసుకుంటూ వెళ్తుండగా హస్తినాపురంలో వైన్షాపులో పనిచేసే గడిగ సురేష్(24), రికవరీ ఏజెంట్లు పందుల పవన్(28), కుర్రా లవణ్కుమార్(31), నోముల శివ(28), అపుల రవికుమార్(28) సైదులను బెదిరించి నగదు తీసుకుని పంచుకున్నారు. పోలీసులు ఆరుగురిని బుధవారం అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు.