హరితహారాన్ని పండుగలా నిర్వహించాలి
ABN , First Publish Date - 2022-06-25T05:41:47+05:30 IST
హరితహారాన్ని పండుగలా నిర్వహించాలి
కలెక్టర్ బి.గోపి
వరంగల్ కలెక్టరేట్, జూన్ 24: జిల్లా వ్యాప్తంగా హరితహారం పథకాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించడానికి అధికారులు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ బి.గోపి ఆదేశించారు. శుక్రవారం హరితహారం కార్యక్రమంపై కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారంలో భాగంగా రాష్ట్రాన్ని పచ్చదనంగా మార్చేందుకు ప్రతీ యేటా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ఏడు విడుతలు విజయవంతం కావడంతో ఎనిమిదో విడత సక్సె్సకు అన్ని శాఖల అధికారులు కృషిచేయాలన్నారు. త్వరలో ప్రారంభమయ్యే హరితహారం కార్యక్రమాన్ని టార్గెట్కు అనుగుణంగా మొక్కలు నాటాలని సూచించారు. జిల్లాకు 25 లక్షల మొక్కలు నాటే టార్గెట్ నిర్దేశించగా మొక్కలు నాటే ప్రాంతాలను గుర్తించి అంచనా వేయడం జూన్ చివరి వారం లోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జూలై రెండో వారంలో గుంతలు తవ్వాలని, ఆగస్టు నాటడం పూర్తి చేయాలని పేర్కొన్నారు. 60రోజుల్లో రోజుకు 43వేల మొక్కలు నాటాలని సూచించారు. అదనపు కలెక్టర్ బి.హరిసింగ్, జిల్లా ఫారెస్టు అధికారి అర్పణ, డీఆర్డీఏ సంపత్రావు, జడ్పీ సీఈవో రాజారావు, డీపీవో స్వరూప పాల్గొన్నారు.