Warangal జిల్లాలో జోరువాన
ABN , First Publish Date - 2022-07-09T00:46:45+05:30 IST
జిల్లా వ్యాప్తంగా వర్షం పడుతోంది. వరంగల్ నగరంతోపాటుగా జిల్లాలోని 13మండలాల్లో రెండు రోజులుగా వర్షం కురుస్తోంది.
వరంగల్: జిల్లా వ్యాప్తంగా వర్షం పడుతోంది. వరంగల్ నగరంతోపాటుగా జిల్లాలోని 13మండలాల్లో రెండు రోజులుగా వర్షం కురుస్తోంది. జిల్లాలో శుక్రవారం 186.6మి.మీ వర్షపాతం నమోదైంది. ఖానాపురం మండలంలోని పాకాల సరస్సులోకి 19అడుగులకు నీళ్లు చేరడంతో నర్సంపేట రైతుల్లో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పాకాల ఆయకట్టు కింద ఇప్పటికే నారుమడుల్లో నారుపెరిగి నీటి కోసం ఎదురుచూస్తుండగా వర్షం పడడంతో రైతులను ఆదుకున్నట్టయింది. సరస్సులో తూము వరకు నీళ్లు వచ్చి చేరడంతో ఖరీఫ్ పంటకు ఢోకా లేకుండా లేదని రైతులు చెబుతున్నారు. పరకాల ప్రాంతంలోని చలివాగు ప్రాజెక్టులో నీళ్లు చేరడంతో పరకాల డివిజన్లో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. వర్ధన్నపేట నియోజకవర్గంలోని వర్ధన్నపేట, పర్వతగిరి మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదు కావడంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. శుక్రవారం ఒక్కరోజే జిల్లా వ్యాప్తంగా 186.6 మి.మీ వర్షపాతం నమోదయింది. అత్యధికంగా సంగెం మండలంలో 33.8 మి.మీ, పర్వతగిరి మండలంలో 29.6, చెన్నారావుపేటలో 28.4, ఖానాపురం మండలంలో 21.2, దుగ్గొండిలో 14.2, నెక్కొండలో 13.2, వర్ధన్నపేటలో 12.2, నర్సంపేటలో 9.2 మి.మీ, వరంగల్ సిటీలో 9, రాయపర్తిలో 8, గీసుగొండ 4.2, నల్లబెల్లిలో 3.6 మి.మీ వర్షపాతం నమోదయింది.