విహారంలో విషాదం.. అమెరికాలో తెలుగు వ్యక్తి దుర్మరణం!

ABN , First Publish Date - 2021-04-14T18:59:40+05:30 IST

అమెరికాలో విషాద ఘటన చోటు చేసుకుంది.

విహారంలో విషాదం.. అమెరికాలో తెలుగు వ్యక్తి దుర్మరణం!
ప్రతీకాత్మక చిత్రం..

వరంగల్ రూరల్‌: అమెరికాలో విషాద ఘటన చోటు చేసుకుంది. విహారం కోసం అగ్రరాజ్యం వెళ్లిన తెలుగు వ్యక్తి అక్కడి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. యూఎస్‌లో ఉంటున్న కుమారుడి కుటుంబంతో కలిసి కొన్ని రోజులు సరదాగా గడుపుదామని వెళ్లిన తండ్రి అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. వివరాల్లోకి వెళితే.. వరంగల్ రూరల్ జిల్లా పరకాలకు చెందిన ఈదునూరి రాజమౌళి (50) ప్రభుత్వ ఉద్యోగి. హన్మకొండ గోపాలపూర్‌లో నివాసముండే రాజమౌళి.. సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయంలో సూపరింటెండెంట్‌‌గా పనిచేస్తున్నారు. ఆయన చిన్న కుమారు పవన్ కుమార్ మిచిగాన్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. దీంతో కొన్ని రోజులు కొడుకు వద్ద ఉందామని రాజమౌళి తన భార్య నీలిమాతో కలిసి మార్చి 5న అమెరికా వెళ్లాడు.


ఈ క్రమంలో వాషింగ్టన్‌, న్యూయార్క్ నగరాలను కారులో వెళ్లి సందర్శించిన రాజమౌళి కుటుంబ సభ్యులు తిరిగి మిచిగాన్‌కు పయనమయ్యారు. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో(యూఎస్ కాలమానం ప్రకారం) వారు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. భారీ వర్షానికి కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో కారులో వెనుక కూర్చున్న తండ్రి రాజమౌళి, తల్లి నీలిమాను కాపాడేందుకు పవన్‌ తీవ్రంగా ప్రయత్నించాడు. ఎలాగోలా తల్లిని కాపాడిన పవన్.. క్షణాల వ్యవధిలోనే మంటలు ఎక్కువ కావడంతో తండ్రి వాటిలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయాడు. రాజమౌళి మృతితో ఆయన స్వస్థలం పరకాలలో విషాదం నెలకొంది. బంధువులు, కుటుంబ సభ్యులు గుండెలవిసెలా విలపిస్తున్నారు.

Updated Date - 2021-04-14T18:59:40+05:30 IST