ఈ సర్కార్‌కు ముంచడమే తెలుసు: విజయశాంతి

ABN , First Publish Date - 2021-07-12T23:57:16+05:30 IST

కేసీఆర్ సర్కార్ తీరుపై బీజేపీ సీనియర్ నాయకురాలు విజయశాంతి విమర్శలు గుప్పించారు. వర్షాలకు వరంగల్ నగర ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ ...

ఈ సర్కార్‌కు ముంచడమే తెలుసు: విజయశాంతి

హైదరాబాద్: కేసీఆర్ సర్కార్ తీరుపై బీజేపీ సీనియర్ నాయకురాలు విజయశాంతి విమర్శలు గుప్పించారు. వర్షాలకు వరంగల్ నగర ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ ... సోషల్ మీడియా వేదికగా హాట్ కామెంట్స్ చేశారు. 


విజయశాంతి ఏమన్నారంటే.. 


తెలంగాణ మంత్రులు, అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు చెప్పే కల్లబొల్లి కబుర్లలోని మాయలేంటో జంటనగరాల ప్రజలకు బాగా తెలుసు. వానలు పడినప్పుడల్లా కాల్వల్ని తలపించే హైదరాబాద్, సికింద్రాబాద్ వీధులు, నాలాల బారిన పడి జనం విలవిలలాడుతుంటారు. వర్షాలు తగ్గగానే ఈ సమస్యలు మళ్ళీ తలెత్తకుండా చూస్తామంటూ గత ఏడేళ్ళ నుంచి పాలకులు చెబుతుండటం... జనం వింటుండటం మామూలైపోయింది. ఇప్పుడు వరంగల్ ప్రజలకు ఇదే అనుభవాన్ని అందిస్తున్నారు అధికార పార్టీ నేతలు. గతేడాది వరంగల్ నగరంతో పాటు పరిసర ప్రాంతాలన్నీ జలమయమై ఇంకా తేరుకోకముందే... గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న వానలకు మళ్ళీ భీతిల్లిపోయే పరిస్థితి వచ్చింది. 


కిందటి సంవత్సరం ఆగస్టులో వానలు కురిసినప్పుడు మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్, స్థానిక ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు ఉరుకులు పరుగుల మీద సుడిగాలి పర్యటన చేసి వరంగల్ పరిసరాల్లో చోటు చేసికున్న వందలాది ఆక్రమణలు, అక్రమ నిర్మాణాల వల్లే ఈ సమస్య తలెత్తిందని, వెంటనే చర్యలు తీసుకుని ముంపు ముప్పు తప్పిస్తామన్నరు. ఇదెంత నిజమో వరంగల్ వాసులకు ఇప్పుడు అర్థమవుతోంది. గత 2 రోజుల వానల్లో సుమారు 30 కాలనీలు నీట మునిగాయి. ఆక్రమణల కూల్చివేత పనులు అరకొరగా చేస్తున్నారు. కీలకమైన ప్రాంతాల్లో నాలాలపై ఆక్రమణల తొలగింపు... అడ్డుగోడల నిర్మాణం ఊసే లేదు. అవగాహన లేకుండా కాల్వలపై శ్లాబ్‌లు వేసి... రోడ్ల కంటే ఎత్తులో డ్రైనేజీలు కట్టి చారిత్రక వరంగల్ నగరాన్ని మరింత మురికి కూపం చేశారు. ఏ పని చేసినా జనాన్ని ముంచడమే తప్ప మంచి చెయ్యడం తెలియని ఈ సర్కారుకు ముంపు ముప్పు దగ్గరలోనే ఉంది.



Updated Date - 2021-07-12T23:57:16+05:30 IST