ఆప్యాయంగా పలకరిస్తూ... యాత్రలో ముందుకు సాగుతూ..

ABN , First Publish Date - 2022-08-08T05:50:45+05:30 IST

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర 5వ రోజు ఆదివారం భూదాన్‌పోచంపల్లిలో సాగింది.

ఆప్యాయంగా పలకరిస్తూ... యాత్రలో ముందుకు సాగుతూ..
పోచంపల్లిలో వినోదాబావే విగ్రహానికి పూలమాలలు వేసి నమస్కరిస్తున్న బండి సంజయ్‌, పక్కన గూడూరు నారాయణరెడ్డి

భూదాన్‌పోచంపల్లి, అగస్టు 7: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర 5వ రోజు ఆదివారం భూదాన్‌పోచంపల్లిలో సాగింది. కరీంనగర్‌కు చెందిన 20మంది చిన్ననాటి స్నేహితులు సంజయ్‌ను కలిశారు. ‘సంజయ్‌.. కిలోమీటర్ల తరబడి నడుస్తున్నవ్‌..? నీ ఆరోగ్యం జాగ్రత్త.. అసనే వానాకాలం.. వానల్లో తడుస్తూ ఎండలో తిరుగుతున్నవ్‌’ అంటూ వారు బాగోగులు అడిగి తెలుసుకున్నారు. సంజయ్‌ ఒక్కొక్కరినీ పేరుపెట్టి పలకరిస్తూ.. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కలిసిన వారిలో కరుణాకర్‌, శ్రీనివాస్‌, రమేష్‌, క్రిష్ణ, విష్ణు, రాము తదితరులు ఉన్నారు. పట్టణంలోని దోర్నాల కృష్ణ అనే చేనేత కార్మికుడి కుటుంబాన్ని సంజయ్‌ పరామర్శించారు. కృష్ణ ఇటీవల కరోనాతో మృతిచెందగా అతని కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. కృష్ణకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారి చదువుకు అయ్యే ఖర్చును భరిస్తానని సంజయ్‌ హామీ ఇచ్చారు. అదేవిధంగా భూదాన్‌పోచంపల్లి మాజీ జడ్పీటీసీ, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత గోరంటి సుదర్శన్‌రెడ్డి, తెలంగాణ ఉద్యమకారుడు మైసగోని వెంకటేష్‌గౌడ్‌, జలాల్‌పూర్‌ మాజీ సర్పంచ్‌ జిల్కపల్లి బుచ్చిరెడ్డిల నాయకత్వంలో బండి సంజయ్‌ సమక్షంలో బీజేపీలో చేరారు. మరో 200మంది కార్యకర్తలు వివిధ పార్టీల నుంచి బీజేపీలోకి చేరారు. దేశ్‌ముఖి నేత దుర్గం రాజుయాదవ్‌ ఆధ్వర్యంలో మరో 40మంది యువకులు బీజేపీలో చేరారు. 

Updated Date - 2022-08-08T05:50:45+05:30 IST