రైలు మరుగుదొడ్డిలోని wash basinలో పసికందు

ABN , First Publish Date - 2022-05-12T00:28:09+05:30 IST

ఆ తల్లి (Mother)కి ఏం కష్టం వచ్చిందో...మరింకేదైనా కారణం ఉందో...మనసును పాషాణం చేసుకుని పేగు తెంచుకున్న బిడ్డను మరుగుదొడ్డిలో వదిలి వెళ్లిపోయింది

రైలు మరుగుదొడ్డిలోని wash basinలో పసికందు

విశాఖపట్నం: ఆ తల్లి (Mother)కి ఏం కష్టం వచ్చిందో...మరింకేదైనా కారణం ఉందో...మనసును పాషాణం చేసుకుని పేగు తెంచుకున్న బిడ్డను మరుగుదొడ్డిలో వదిలి వెళ్లిపోయింది. అప్పుడే కళ్లు తెరిచిన ఆ బిడ్డను మరుగుదొడ్డిలో చూసిన ప్రయాణికులు మాత్రం ఉలిక్కిపడ్డారు. ధన్‌బాద్‌ నుంచి అలెప్పీ వెళుతున్న 13351 నంబరు రైలు బుధవారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో విశాఖపట్నం రైల్వే స్టేషన్‌ (Visakhapatnam Railway Station) కు చేరింది. రైలు ఆగిన కొన్ని నిమిషాలకు బీ-2 కోచ్‌లో పసిబిడ్డ ఏడుపు వినిపించింది. కోచ్‌లోని ప్రయాణికులు బెర్తుల వైపు చూశారు. ఎవరి చేతిలోనూ శిశువు కనిపించలేదు. ఆ ఏడుపు మరుగుదొడ్డి నుంచి వస్తోందని గ్రహించి డోర్‌ తెరిచి చూశారు. అంతే ఒక్కసారి షాక్‌కు లోనయ్యారు. టాయ్‌లెట్‌లోని వాష్‌ బేషిన్‌ (wash basin)లో మగ శిశువు గుక్కపెట్టి ఏడుస్తూ కనిపించాడు. వెంటనే స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఆర్పీఎఫ్‌ సిబ్బందికి సమాచారమిచ్చారు. ఆర్పీఎఫ్‌ మహిళా సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పుష్పతో పాటు జీఆర్పీ సిబ్బంది కోచ్‌లోకి చేరుకున్నారు. వాష్‌బేషిన్‌లోని శిశువును బయటకు తీశారు. రెండు కిలోల బరువు గల పసికందును హుటాహుటిన రైల్వే ఆసుపత్రికి తరలించారు. రైల్వే ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేసిన అనంతరం కేజీహెచ్‌కు తరలించారు.

కాగా అదే ట్రైన్‌లో ప్రయాణిస్తున్నవారి సమాచారం ప్రకారం... ఓ యువతి తన చేతుల్లో నవజాత శిశువుతో  రైలు ఎక్కింది. విశాఖపట్నంలో ట్రైన్ ఆగింది. ఆ తర్వాత బయలుదేరుతుండగా నిందిత యువతి శిశువు లేకుండానే  హడావుడిగా ట్రైన్ దిగేసింది. ఈ సమాచారం ఆధారంగా రైల్వే పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. నిందిత యువతిని గుర్తించేందుకు అన్వేషిస్తున్నారు. కాగా యువతి వయసు 20 -29 ఏళ్లు ఉండొచ్చని ప్రయాణికులు చెబుతున్నారు. పెళ్లికాకుండానే గర్భం దాల్చడం లేదా అక్రమ సంతానం అయ్యివుండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సెక్షన్ 317 కింద కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు.

Read more