తాగునీరివ్వండి మహాప్రభో..!

ABN , First Publish Date - 2022-10-07T05:03:02+05:30 IST

వేసవికాలంలో రావాల్సిన నీటి కష్టాలు ఆ గ్రామానికి ముందుగానే వచ్చాయి.

తాగునీరివ్వండి మహాప్రభో..!

ముద్దనపల్లిలో తాగునీటికి కటకట

వ్యవసాయ బోర్లను ఆశ్రయిస్తున్న ప్రజలు 

పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు

బత్తలపల్లి 

వేసవికాలంలో రావాల్సిన నీటి కష్టాలు ఆ గ్రామానికి ముందుగానే వచ్చాయి. గుక్కెడు తాగునీటి కోసం తంటాలు పడుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా తాగునీటి కష్టాలు తీర్చలేదు. ఇక చేసేది లేక వ్యవసాయ బోర్లను ఆశ్రయించి మంచినీటి కోసం పరుగులు తీస్తున్నారు. బత్తలపల్లి మండలం మద్దనపల్లి వాసులు. వంద ఇళ్లు ఉన్న ముద్దనపల్లి గ్రామంలో 350 మంది జనాభా ఉన్నారు. గ్రామంలో నాలుగు బోర్లు ఉన్నాయి. అందులో మూడు బోర్లు పూర్తిగా చెడిపోయాయి. ఒక్కబోరులో వస్తున్న నీరు ఏమాత్రం సరిపోవడం లేదు. ఈ క్రమంలో 15 రోజులుగా తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చింది. చేసేదిలేక గ్రామస్థులు వ్యవసాయ బోర్ల వద్దకు పరుగులు తీస్తున్నారు. నిత్యం కూలిపనులకు వెళ్లే తాము నీటి కోసం సమయాన్ని వృథా చేసుకుంటున్నట్లు ప్రజలు వాపోయారు. పనులు మానుకుని సమయమంతా వ్యవసాయ బోర్ల వద్దే నీటి కోసం కాపు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది.  వ్యవసాయ బోర్ల వద్దకు ద్విచ్రవాహనాలు, ట్రాక్టర్‌, సైకిళ్లపై వెళ్లి నీటిని తెచ్చుకుంటున్నారు. ప్రజలు ఇన్ని కష్టాలు పడుతున్నా ప్రజలు, ప్రజాప్రతినిధులు గ్రామం వైపు కన్నెత్తి చూడలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం పండుగ సమయంలోనూ తాగునీరు లేక అవస్థలు పడ్డామని వాపోయారు. గతంలో ఆరుసార్లు బోర్లకు మరమ్మతు పనులు చేపట్టినట్లు సర్పంచ ప్రభాకర్‌ రెడ్డి తెలిపారు. పంచాయతీ ఖాతాల్లో నిధులు లేవని, ఇలాంటి సమయంలో అభివృద్ధి ఎలా చేయగలమని ఆయన వాపోయాడు. తన సొంత నిధులతో ఆరుసార్లు బోర్లను రిపేరీ చేయించానని, ఇంతవరకు ఒక్క రూపాయి కూడా బిల్లులు రాలేదన్నారు.



Updated Date - 2022-10-07T05:03:02+05:30 IST