అంతా... రహస్యం!
ABN , First Publish Date - 2022-05-26T06:37:38+05:30 IST
రక్షిత మంచినీటి పథకాల అవినీతి పనులకు సంబంధించి బుధవారం రాయనపాడు, పైడూరుపాడు గ్రామాల్లో క్వాలిటీ కంట్రోల్ విచారణ ‘రహస్యం’గా జరిగిపోయింది.
విచారణ మమ అని పించేశారు!
ఫిర్యాదు చేసిన వారిని పిలవలేదు
మీడియాను తప్పుదారి పట్టించారు
ఫీల్డ్ లెవల్లో ఆత్రంగా ముగించేశారు
గోతులు తవ్వి మెటీరియల్ను సేకరించని వైనం
నోరు మెదపని క్వాలిటీ కంట్రోల్ అధికారి
గంటన్నరపాటు ఎస్ఈతో భేటీ!
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : రక్షిత మంచినీటి పథకాల అవినీతి పనులకు సంబంధించి బుధవారం రాయనపాడు, పైడూరుపాడు గ్రామాల్లో క్వాలిటీ కంట్రోల్ విచారణ ‘రహస్యం’గా జరిగిపోయింది. ఫిర్యాదు చేసిన వారిని ఫీల్డ్ ఎంక్వయిరీకి పిలవనే లేదు. మీడియా ఎక్కడ వస్తుందోనని... ఫలానా చోట అంటూ లీకులు ఇచ్చి.. మరోచోటకు వెళ్లారు. ఎక్కడా ఫొటోలకు తాము కానీ, జరిగిన పనులు దొరక్కుండా జాగ్రత్తపడ్డారు. భూమిని తవ్వి మెటీరియల్ శాంపిల్ తీయలేదు. విచారణ పేరుతో బాధ్యులైన అధికారులను గట్టెక్కించే ప్రయత్నాలను ప్రీ ప్లాన్డ్గా అమలు చేశారు. క్షేత్రస్థాయిలో పట్టుమని పది నిమషాలు కూడా విచారణ చేయని అధికారులు... విజయవాడలోని ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయంలో ఎస్ఈ నెక్కంటి సత్యనారాయణ, క్వాలిటీ కంట్రోల్ డీఈఈ హరమోహన్ దాదాపుగా గంటన్నరసేపు ఎవ్వరినీ తమ చాంబర్కు రాకుండా ఏకాంతంగా సమావేశమయ్యారు. తాము పారదర్శకంగా ఉన్నామని చెప్పటానికైనా విచారణను బహిరంగంగానే నిర్వహిస్తారు. అలాంటిదేమీ లేదు. జరిగిన స్కామ్ అందరికీ కనిపిస్తున్నా .. అర్థమౌతున్నా .. అదేమిటో ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు మాత్రం కానరావటం లేదు. దీనిని బట్టి చూస్తే ఆర్డబ్ల్యూఎస్లో పైస్థాయి నుంచి కింది స్థాయి వరకు లోతైన సంబంధాలు ఉన్నాయన్నది అర్థమౌతోంది.
ఫిర్యాదుదారులను ఎందుకు పిలవలేదు ?
సహజంగా అవినీతి ఆరోపణలకు సంబంధించి ఎవరైనా ఫిర్యాదు చేస్తే డిపార్ట్మెంటల్ ఫీల్డ్ ఎంక్వయిరీలో ఫిర్యాదులు చేసిన వారిని కూడా పిలవాల్సి ఉంటుంది. రాయనపాడు, పైడూరుపాడు గ్రామాల్లో జరిగిన పనులకు సంబంధించి మాత్రం ఫిర్యాదుదారులను పిలవలేదు. డిపార్ట్మెంటల్ ఫీల్డ్ ఎంక్వయిరీకి సంబంధించిన ఆదేశాల్లో ఫిర్యాదుదారులను కోట్ చేశారు. ఇలా ఆదేశాల్లో వారి పేర్లను ఎండార్స్ చేసినందుకైనా కచ్చితంగా పిలిచి వారిచేత ఎక్కడెక్కడ అవినీతి పనులు జరిగాయో చూపించమని కోరాలి. దీనికి విరుద్ధంగా జరగటం పట్ల ఫిర్యాదుదారులు కూడా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.