అగ్నిమాపక కేంద్రానికి తీరిన నీటిసమస్య

ABN , First Publish Date - 2022-05-28T06:13:39+05:30 IST

పదేళ్ల నుంచి నీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న కంభం అగ్నిమాపక కేంద్రానికి నీటి సమస్య తీరుస్తూ ఎంపీపీ చేగిరెడ్డి తులసమ్మ రూ.2లక్షల నిధులు మంజూరు చేశారు.

అగ్నిమాపక కేంద్రానికి తీరిన నీటిసమస్య
కంభంలోని అగ్రిమాపక కేంద్రం

అగ్నిమాపక కేంద్రానికి తీరిన నీటిసమస్య

కంభం, మే 27 : పదేళ్ల నుంచి నీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న కంభం అగ్నిమాపక కేంద్రానికి నీటి సమస్య తీరుస్తూ ఎంపీపీ చేగిరెడ్డి తులసమ్మ రూ.2లక్షల నిధులు మంజూరు చేశారు. అంతేకాకుండా అగ్నిమాపక కేంద్ర ఆవరణలో బోరు నిర్మాణానికి పూజలు చేసి బోరు వేయించారు. దీంతో అగ్నిమాపక సిబ్బందితోపాటు కంభం, బేస్తవారపేట, అర్థవీడు మండలాల ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. 1988లో అప్పటి వైద్య ఆరోగ్యశాఖమంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు కంభంలో అగ్నిమాపక కేంద్రాన్ని ప్రారంభించారు. కంభం, అర్థవీడు, బేస్తవారపేట మండలాల్లోనేకాక ఇతర ప్రాంతాల్లో జరిగే అగ్నిప్రమాదాల నివారణకు ఈ కేంద్రం ఏర్పాటు చేశారు. అయితే 10 సంవత్సరాల క్రితం అగ్నిమాపక కేంద్రంలోని బోరు చెడిపోవడంతో సిబ్బంది వ్యవసాయ బోర్ల వద్దకు వెళ్లి నీటిని నింపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో అగ్నిమాపక అధికారులు నూతన బోరు మంజూరు చేయాలని పలు మార్లు జిల్లాస్థాయి అధికారులకు, రాజకీయ నేతలకు చెప్పినా ఫలితం లేకుండా పోయింది. ఇటీవల అగ్నిమాపక కేంద్రంలో జరిగిన ఓ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీపీ చేగిరెడ్డి తులసమ్మ దృష్టికి కేంద్రంలో బోరు చెడిపోవడంతో పడుతున్న ఇబ్బందులను సిబ్బంది తీసుకెళ్లారు. దీంతో ప్రత్యేక నిధులు రూ.2లక్షలు మంజూరు చేయించడమేకాక గురువారం అగ్నిమాపక కేంద్రంలో బోరుకు పూజలు చేసి డ్రిల్లింగ్‌ చేశారు. 600 అడుగులలో నీరు పుష్కలంగా పడడంతో  కంభం అగ్నిమాపక కేంద్రాన్ని పట్టిపీడిస్తున్న నీటి సమస్య తీరినట్లయింది. దీంతో అగ్నిమాపక అధికారి ప్రసాదరావు, సిబ్బంది ఎంపీపీ తులసమ్మకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు కొత్తపల్లి జ్యోతి, సర్పంచ్‌ బత్తుల తిరుపాలమ్మ, చేగిరెడ్డి ఓబులరెడ్డి, సైదాపురం రమణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-28T06:13:39+05:30 IST