rebels కాదు.. మేమే అసలైన Shiv Sena: Eknath Shinde
ABN , First Publish Date - 2022-06-30T00:23:27+05:30 IST
ఉద్ధవ్ థాకరే సహా శివసేన పార్టీ పలుమార్లు చేసిన విజ్ణప్తుల అనంతరం ఎట్టకేలకు ఆయన ముంబైకి బయల్దేరారు. రేపు ఉదయం నాటికి తామంతా ముంబైలో ఉంటామని ఏక్నాథ్ షిండే స్వయంగా తెలిపారు..
ముంబై: తమను రెబెల్(rebel) ఎమ్మెల్యేలని సంబోధించడంపై తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే(Eknath Shinde) అభ్యంతరం వ్యక్తం చేశారు. తాము రెబెల్స్ కాదని, అసలైన శివసేన(Shiv Sena) తామేనని ఆయన పేర్కొన్నారు. అస్సాం నుంచి ముంబై(Mumbai)కి వస్తున్న తరుణంలో గువహాటి ఎయిర్పోర్ట్(Guwahati airport)లో మీడియా ఆయనను ప్రశ్నించింది. ఈ సందర్భంలో రెబెల్ ఎమ్మెల్యేలు అని సంబోధించగా.. ఆయన పై విధంగా సమాధానం ఇస్తూ బాలాసాహేబ్ థాకరే(Balasaheb Thackeray) ఆలోచనా విధానాన్ని తామే ముందుకు తీసుకెళ్తామని, హిందుత్వం(Hindutva) కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం పని చేస్తామని అన్నారు.
ఉద్ధవ్ థాకరే సహా శివసేన పార్టీ పలుమార్లు చేసిన విజ్ణప్తుల అనంతరం ఎట్టకేలకు ఆయన ముంబైకి బయల్దేరారు. రేపు ఉదయం నాటికి తామంతా ముంబైలో ఉంటామని ఏక్నాథ్ షిండే స్వయంగా తెలిపారు. అలాగే మహారాష్ట్ర అసెంబ్లీలో నిర్వహించే విశ్వాస పరీక్ష(Trust Vote)లో సైతం షిండే కూటమి ఎమ్మెల్యేలు పాల్గొననున్నాన్నారట. అనంతరం పార్టీ లెజిస్లేటివ్ మీటింగ్ కొనసాగనుందని, ఆ తర్వాత పార్టీ, రాష్ట్ర రాజకీయ అంశాలపై చర్చించనున్నట్లు ఏక్నాథ్ షిండే తెలిపారు.
కొద్ది రోజులుగా మహారాష్ట్ర రాజకీయాల్లో ఏక్నాథ్ షిండే సంచలనంగా మారారు. అధికార పార్టీ శివసేనకు చెందిన ఎమ్మెల్యేల్లో ఏకంగా 40 మందిని తీసుకెళ్లి ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేకు వ్యతిరేకంగా తిరుగుబావుటా ఎగరవేశారు. దీంతో రాష్ట్ర రాజకీయం అల్లకల్లోలం అయింది. ఒక పక్క మహా వికాస్ అగాఢీ ప్రభుత్వం కుప్పకూలనుంది అనే అంచనాలు.. మరొక పక్క భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు కానుందనే అంచనాలు. ఈ రెండింటి నడుమ ఏక్నాథ్ కీలకంగా మారారు. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఒకసారి, తమకు బీజేపీ మద్దతు ఉందని ఒకసారి, తమకు ఏ జాతీయ పార్టీ మద్దతు లేదంటూ మరొకసారి మాటమారుస్తూ వస్తోన్న షిండే రేపటి విశ్వాస పరీక్షలో ఏం చేయనున్నారనే ఆసక్తి నెలకొంది.