కశ్మీరుకు మళ్ళీ వచ్చేది లేదు : కార్మికులు

ABN , First Publish Date - 2021-10-20T02:10:53+05:30 IST

ఉగ్రవాదులు కొద్ది వారాలుగా హిందువులు, సిక్కులను లక్ష్యంగా

కశ్మీరుకు మళ్ళీ వచ్చేది లేదు : కార్మికులు

శ్రీనగర్ : ఉగ్రవాదులు కొద్ది వారాలుగా హిందువులు, సిక్కులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తుండటంతో కశ్మీరు లోయ నుంచి చాలా మంది వెళ్ళిపోతున్నారు. జీవనోపాధి కోసం ఇక్కడికి వెళ్ళినవారు ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని పారిపోతున్నారు. ఇదే అదనుగా వీరి యజమానులు వీరికి వేతనాలను చెల్లించకుండా తప్పించుకుంటున్నారు. 


గడచిన రెండు వారాల్లో 11 మంది స్థానికేతరులను ఉగ్రవాదులు ఎంపిక చేసి మరీ చంపేశారు. దీంతో ఇటుకల బట్టీలు వంటి వాటిలో పని చేసేందుకు ఇతర ప్రాంతాల నుంచి కశ్మీరు లోయకు వచ్చిన సిక్కులు, హిందువులు భయాందోళనతో పారిపోతున్నారు. దక్షిణ కశ్మీరులోని పుల్వామా నుంచి జమ్మూ రైల్వే స్టేషన్‌కు అతి కష్టం మీద చేరుకుంటున్నారు. రెండు వారాల నుంచి నరకం అనుభవిస్తున్నామని వీరు మీడియాకు చెప్పారు. తమ యజమానులు తమకు చెల్లించవలసిన సొమ్మును చెల్లించడం లేదని, అధికారులు జోక్యం చేసుకుని తమ సొమ్మును తమకు ఇప్పించాలని కోరారు. 


రైల్వే స్టేషన్‌కు చేరుకున్నవారిలో బిహార్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, పంజాబ్ వంటి రాష్ట్రాలకు చెందినవారు ఉన్నారు. తాము జీవనోపాధి కోసం కశ్మీరు లోయకు ప్రతి సంవత్సరం వస్తూ ఉంటామని, ఇకపై రాలేమని చెప్పారు. కశ్మీరు అంటే భూతల స్వర్గమని ఎవరో చెబితే ఇక్కడికి వచ్చామని, ఇది స్వర్గం కాదని, నరకమని వీరు వాపోతున్నారు. 


Updated Date - 2021-10-20T02:10:53+05:30 IST